తెలంగాణ మాడల్కన్నా గొప్ప మాడల్ దేశంలో మరే రాష్ట్రంలో అయినా ఉన్నదా? ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంకెవరైనా సరే తెలంగాణ కంటే అద్భుతమైన మాడల్ ఏదైనా ఉన్నదా? చెప్పాలి. తెలంగాణకన్నా ఇతర రాష్ర్టాల్లో అద్భుతాలు చేస్తున్నాయని నిరూపించే సత్తా ఉంటే చెప్పండి. ఆ పార్టీల పాలిత రాష్ట్రాల్లో ఏ రంగంలో అయినా తెలంగాణకంటే మెరుగైన పరిపాలన అందించారా? ఈ విషయంపై ప్రజలు కూడా ఆలోచించాలి.
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): దేశానికి రాజకీయ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయేనని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. దేశానికి కావలసింది ఫ్రంట్లు.. టెంట్లు కాదని, ఒకరిని ఓడించటం.. మరొకరిని గద్దెమీద కూర్చొబెట్టం బీఆర్ఎస్ సిద్ధాం తం కాదని స్పష్టం చేశారు. ప్రజల అభీష్టాన్ని నెరవేర్చే పాలన అందించాలన్నదే బీఆర్ఎస్ ఎజెండా అని తెలిపారు. సమదృష్టితో దేశాన్ని పాలించే విధానం కావాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ముందుకు సాగుతున్నదని చెప్పారు. మంత్రి కేటీఆర్ గురువారం మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం బీఆర్ఎస్ పనిచేస్తున్నదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని, బీఆర్ఎస్ పాలనలో అనతికాలంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని చెప్పారు. తెలంగాణ మాడల్ను నేడు దేశమంతా కోరుకొంటున్నదని తెలిపారు.
దేశంలో ఉన్నది బహుళపార్టీ వ్యవస్థ అని, ద్విపార్టీ వ్యవస్థ కాదని కేటీఆర్ చెప్పారు. అర్హత ఉన్న నాయకుడే దేశాన్ని పాలిస్తాడని తెలిపారు. ‘అయితే బీజేపీ పాలించాలి.. లేకుంటే కాంగ్రెస్ పాలించాలనే ఆలోచన సరైంది కాదు. నిజానికి ఆ రెండు పార్టీలు మాత్రమే పాలించాలని ప్రజలు కోరుకోవడంలేదు. అనతికాలంలోనే అభివృద్ధికి, సంక్షేమానికి తెలంగాణ రోల్ మాడల్గా నిలిచింది. దేశం ఇవ్వాళ ఇదే నమూనాను కోరుకొంటున్నది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పుట్టింది. తెలంగాణ పథకాలను మహారాష్ట్ర, కర్ణాటకసహా అనేక రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి. రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు? మోదీ ఏం చేస్తారు? అనేది మాకు అవసరం లేదు. దేశంలో గుణాత్మక మార్పు కోసమే బీఆర్ఎస్ ఏర్పడింది. దేశవ్యాప్తంగా తెలంగాణ మాడల్పై విస్తృత చర్చ జరుగుతున్నది.
‘ఎంతసేపూ థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ టెంట్లు గురించే కాదు.. అక్కడో దుకాణం పెట్టి, ఇక్కడో దుకాణం పెట్టి.. ఆయన్ని పడగొట్టుడే మా లక్ష్యం. ఈయనను గుంజేసుడే మా లక్ష్యం అనేది ఏం పద్ధతి? మీ దగ్గర మాకంటే మంచి కార్యాచరణ ఉంటే ప్రజలకు చూపండి’ అని కేటీఆర్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. తెలంగాణలో ఇంటింటికీ తాగునీరు ఇచ్చినట్టు దేశమంతా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఈ విషయంలో మోదీ ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. మైనార్టీ వెల్ఫేర్లో తెలంగాణ దేశానికే రోల్ మాడల్ అని వేరే రాష్ర్టాలకు వెళ్లి అసుదుద్దీన్ పదేపదే చెప్తున్నారని అన్నారు. ఎంఐఎం ఎక్కడ, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనేది పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు.
ఏబుల్ గవర్నమెంట్.. స్టేబుల్ లీడర్షిప్ తెలంగాణలోనే ఉన్నది. గతంలో బెంగాల్ ఏం ఆలోచిస్తదో భారతదేశం దాన్ని ఆచరిస్తది అనే నానుడి ఉండేది. నేడు తెలంగాణ ఏం చేస్తే రేపు దేశం దాన్ని అనుసరిస్తుంది అనేదాకా తెలంగాణ ఎదిగింది.
అనుకరణ నేడు తెలంగాణ ఏది చేస్తే, రేపు దేశం అదే చేసే పరిస్థితి వచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీ హబ్ చూసి. మహారాష్ట్ర ఎం హబ్ అని మొదలుపెట్టిందని గుర్తుచేశారు. టీ హబ్, టీ వర్క్స్ అనే కాదు.. దళితబంధు, రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ.. పాతాళంలో ఉండే బొగ్గు నుంచి అంతరిక్షంలోకి పంపే రాకెట్ల దాకా అన్నిరంగాల్లో తెలంగాణను దేశం అనుసరిస్తున్నదని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ, ఆయన మంత్రిమండలి మొత్తం తిష్టవేసి, ఎన్నో రకాలుగా మభ్యపెట్టి ప్రచారం చేసినా కర్ణాటక ప్రజలు వారిని ఛీకొట్టారని కేటీఆర్ ఎద్దేశా చేశారు. ‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, మునుగోడు ఉపఎన్నికలో ఇంతమంది పనిచేస్తారా? అని మాట్లాడారు. మరి కర్ణాటకలో వారు చేసిందేమిటి. మణిపూర్ ఒకవైపు మండిపోతుంటే.. ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు కర్ణాటక ఎన్నికల క్యాంపెయిన్లో బిజీగా ఉన్నారు. వీటన్నింటినీ ఆలోచించారు కాబట్టే కర్ణాటక ప్రజలు చెడు పాలనకు చరమగీతం పాడారు. తెలంగాణలో మేము మెరుగైన పాలన అందించాం కాబట్టే ప్రజలు ఆదరిస్తున్నారు. ఎలాంటి నాయకులు కావాలి? ఎలాంటి పాలన కావాలి అనేది అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారు’ అని చెప్పారు.
మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ మూడు మీటింగులు పెట్టగానే అక్కడి పార్టీల పీఠాలు కదులుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజల అభీష్టం మేరకు మహారాష్ట్ర గవర్నమెంట్ రైతుబంధులాంటి పథకం ప్రవేశపెట్టిందని చెప్పారు. పీఠాలు కదులుతున్నాయనే భయం పుట్టింది కాబట్టే అక్కడ మార్పులు జరుగుతున్నాయని, అటువంటి మార్పునే దేశం కోరుతున్నదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ బీఆర్ఎస్ విస్తరిస్తున్నదని తెలిపారు. ఇప్పటికే గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామని, విజయవాడ మాజీ మేయర్ కూడా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారని చెప్పారు.
దేశానికి ఉత్తమ పాలన అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, తమ సిద్ధాంతాన్ని, పనులను నమ్మి ఎవరైనా కలిసివస్తే.. వారితో కలిసి పనిచేసేందుకు అభ్యంతరం లేదని కేటీఆర్ తెలిపారు. మధ్యప్రదేశ్ మాజీ ఎంపీ ఒకరు, ఒడిశా మాజీ సీఎం కూడా బీఆర్ఎస్లో చేరారని గుర్తుచేశారు. ‘మేము అభివృద్ధి అనే స్క్రూ తిప్పాం. అది తెలంగాణ సరిహద్దు రాష్ర్టాల్లో ప్రభావం చూపడం మొదలుపెట్టింది. దేశాన్ని ఎలా అభివృద్ధి బాట పట్టించాలో మాకొక ప్రణాళిక, కార్యాచరణ ఉన్నది’ అని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ హయాంలో జరిగిన అతిపెద్ద సంక్షోభం నోట్ల రద్దు అని, దానివల్ల ఇబ్బందులు పడ్డది సామాన్యులేనని కేటీఆర్ విమర్శించారు. ‘ఏ దేశమైనా తమ పౌరులకు ఉచితంగానే వ్యాక్సినేషన్ చేస్తుంది. గతంలోనూ ఇండియాలో పలు వ్యాధులకు వ్యాక్సినేషన్ ఉచితంగానే చేశారు. మోదీ ప్రభుత్వమే తొలిసారి ఉచితంగా, ఉదారంగా ప్రజలకు వ్యాక్సినేషన్ చేపట్టినట్టు పబ్లిసిటీ చేసుకొన్నది. చేతకాని ప్రధానికి సంబంధించి ఇట్లాంటి లోపాలను వందల్లో చూపించగలం. దేశ అభివృద్ధిని మరిచిన మోదీ అసమర్థతపై చర్చ పెట్టాలి’ అని మీడియాను కోరారు. సీఎం కేసీఆర్ దగ్గర ఓ అభివృద్ధి మంత్రం, మాడల్ ఉన్నదని, దానిని దేశానికి చూపించాలని భావిస్తున్నామని చెప్పారు.
‘తెలంగాణ మాడల్ను చూసే కదా 75 ఏండ్ల స్వతంత్ర భారతం తిరిగి అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నది. తెలంగాణలో ప్రజలందరికి తాగునీరు ఎలా అందించగలిగారు? నిరంతరాయంగా విద్యుత్తు ఎలా ఇవ్వగలుగుతున్నారు? రైతులకు సాగునీరు, సంక్షేమ పథకాలు ఎలా అందిస్తున్నారు.? అనే విషయాలను దేశం మొత్తం చర్చిస్తున్నది. ఇదే మా అజెండా, ఇదే మా ఆలోచన’
– మంత్రి కేటీఆర్