Kanti Velugu | సిద్దిపేట : అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీశ్రావు(Minister Harish Rao) తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనతో ప్రారంభించిన కంటి వెలుగు అద్భుతంగా కొనసాగుతున్నదని ప్రశంసించారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో కంటి వెలుగు కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ఆయన కంటి పరీక్షలను చేయించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ప్రజలు ఎవరూ కూడా కంటి సమస్యతో బాధ పడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కంటి వెలుగు అనే మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. పండుగ వాతావరణంలో జరుగుతున్న కంటి వెలుగులో నేటి కి 50 లక్షల మందికి పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. ‘ ప్రభుత్వ కార్యక్రమంతో ప్రజలకు ఆనంద భాష్పాలు.. ప్రతి పక్షాలకు కన్నీటి ( కన్నీళ్లు ) భాష్పాలు’ వస్తున్నాయని ఎద్దేవా చేశారు.
గడిచిన 25 రోజుల పని దినాల్లో నేటికి పరీక్షల సంఖ్య 50 లక్షల మార్కుకు చేరుకున్నది. 25 పని దినాల్లో ఇంత పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం, అవసరం ఉన్నవారికి అద్దాలు పంపిణీ చేయడం గొప్ప విషయం ’ మని పేర్కొన్నారు. ఆసుపత్రుల వద్దకు ప్రజలు రావడం కాదు, ఊరుకు, వాడకు ప్రభుత్వమే కదిలి వస్తున్నదని చెప్పారు. ఉచితంగా కంప్యూటరైజ్డ్(Computerized) కంటి పరీక్షలు నిర్వహించి, మందులు, అవసరం అయిన వారికి కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నదని అన్నారు.
World’s largest eye screening programme గా రికార్డు సృష్టించాలని కష్ట పడుతున్నామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కుల, మతాలకు అతీతంగా నిర్వహిస్తున్న కంటి వెలుగులో ప్రస్తుతం నిర్వహించిన 50 లక్షల పరీక్షల్లో 16 లక్షల మందికి కంటి పరీక్షకు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. వీరిలో 9,35,512 మందికి రీడింగ్ గ్లాసెస్ అక్కడికక్కడే పంపిణీ చేయగా, ప్రిస్కిప్షన్ కు గ్లాసెస్ రిఫర్ చేసిన 6,49,507 మందిలో 54,324 మందికి ఇంటికి వెళ్లి కళ్లద్దాలు పంపిణీ చేశామని వివరించారు.
మొత్తం 50 లక్షల మందిలో 34 లక్షల మందికి అంటే 68శాతం ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. ఈ అద్భుత పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేస్తామని భగవంత్ మాన్, కేజ్రీవాల్ చెప్పారని వెల్లడించారు. ‘ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి మన కంటి వెలుగు అద్బుతం . మా రాష్ట్రంలో కూడా అమలు చేస్తా అన్నాడంటనే ఈ కార్యక్రమం గొప్పతనం అర్థం చేసుకోవచ్చని’ అన్నారు. రాష్ట్రంలో అందరికీ కంటి పరీక్షలు చేసి, ప్రాథమికంగా 30లక్షల రీడింగ్ గ్లాస్, 25 లక్షల ప్రిస్కిప్షన్ గ్లాసెస్ అవసరమైన వారికి ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు లో భాగస్వామ్యం అయిన సహచర మంత్రులకు , శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు , జిల్లా పరిషత్ చైర్మన్లకు , కార్పొరేషన్ చైర్మన్లకు, మున్సిపల్ చైర్మన్ లకు, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీ లకు ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి హరీశ్రావు ధన్యవాదాలు తెలిపారు.