హైదరాబాద్ : ఈనెల 12న ప్రధాని మోదీ రాకను నిరసిస్తూ అన్ని కార్మిక సంఘాలతో బ్లాక్ డే ను నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్ తెలిపారు. బుధవారం హిమాయత్ నగర్లోని ఎస్ఎన్ రెడ్డి భవన్లో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బ్లాక్ డేను నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణ అభివృద్ధికి అనేక హామీలిచ్చిన కేంద్రం వాటిని నెరవేర్చడం లేదని ఆరోపించారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకే రాష్ట్రంలో మోదీ పర్యటిస్తున్నారని పేర్కొన్నారు. 2021 నుంచే రామగుండం ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభించిందని, అప్పటి నుంచి సుమారు పది లక్షల టన్నులకు పైగా ఎరువుల ఉత్పత్తి సరఫరా అవుతుందన్నారు.
అయితే ప్రజలను మభ్యపెట్టేందుకు పాత ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు రాష్ట్రానికి రావడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఈనెల 12న నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు యండీ యూసుఫ్, జాతీయ నాయకుడు రత్నాకర్, నాయకులు పాల్గొన్నారు.