హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతుండటంపై పార్టీ ఢిల్లీ పెద్దలు ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇన్నాళ్లూ బీజేపీకి పెద్దగా ఆదరణ లేదని, బండి సంజయ్, తరుణ్ చుగ్ కలిసి మభ్యపెడుతున్నారని అధిష్ఠానానికి పార్టీ నేతలే ఫిర్యాదు చేశారు. కానీ.. బండి బ్యాచ్ చేసిన హడావుడిని చూసి వాళ్లు పెద్దగా నమ్మలేదు. తాజాగా కరీంనగర్లో స్వయంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాప్ అవడంతో అసలు విషయం బోధపడింది. కరీంనగర్ తన సొంత ప్రాంతం కావడంతో ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు లక్షల మంది ప్రజలు తరలివస్తారని బండి సంజయ్ గప్పాలు కొట్టుకొన్నారు. ఆయన బ్యాచ్ ఢిల్లీ పెద్దల వద్ద కూడా ఇదే విషయాన్ని ఊదరగొట్టింది. ఇది నమ్మి జేపీ నడ్డా కరీంనగర్ వచ్చేందుకు అంగీకరిచారు. బీజేపీ నాయకత్వం సైతం భారీగా ఏర్పాట్లు చేసింది. కానీ.. వాస్తవం చూసి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. లక్షల మంది తరలివస్తారనుకుంటే కనీసం కుర్చీలు కూడా నిండని పరిస్థితి. వచ్చినవారు కూడా జేపీ నడ్డా ప్రసంగం పూర్తికాకముందే లేచి వెళ్లిపోయారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉన్నదో నడ్డాకు తెలిసివచ్చింది. అసలే బీజేపీకి ఆదరణ లేదని.. ఉన్న కాస్త ఇమేజ్ రోజురోజుకూ పడిపోతున్నదని అర్థమైంది. ఇలా అయితే కష్టమేనని, ఎలాగైనా రాష్ట్ర బీజేపీకి రిపేర్లు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
ప్రజలు పట్టించుకోని యాత్ర
బండి సంజయ్ కేవలం తన వ్యక్తిగత ప్రాబల్యం కోసమే ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో యాత్రలు నిర్వహిస్తున్నట్టు ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. దీనికి తగ్గట్టే ప్రజలు ఏమాత్రం ఆదరించకపోయినా వరుసగా యాత్రలు చేపట్టడంపై నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రలు మొదలు పెట్టింది, పూర్తి చేసింది కూడా ఎవరికీ తెలియడం లేదని స్వయంగా కార్యకర్తలే వాపోతున్నారు. బండి సంజయ్ అనుచరులు, వాళ్లు తీసుకొచ్చే కిరాయి మనుషులు తప్ప పాదయాత్రకు ప్రజాదరణ ఎక్కడా లేదని చెప్తున్నారు. పైగా.. అక్కడక్కడా ప్రజలపైనే దాడులు, బెదిరింపులకు దిగుతున్న ఘటనలు కూడా చోటుచేసుకొన్నాయి. దీంతో ‘ప్రజాగోస పేరుతో యాత్ర చేస్తూ.. దాడులు, బెదిరింపులతో ప్రజలను గోస పెట్టడం తప్ప చేస్తున్నది ఏమిటి?’ అని పలువురు నేతలు విమర్శిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన యాత్రతో ఈ విషయం అధిష్ఠానం దృష్టికి కూడా వెళ్లినట్టు తెలిసింది.
దీంతో ‘ఇక పాదయాత్రలు చాలు.. సీరియస్గా రాజకీయాలపై దృష్టిపెట్టండి’ అని బండి సంజయ్కి ఢిల్లీ పెద్దలు చురక అంటించినట్టు తెలిసింది. ‘చేరికలు ఎందుకు లేవు? సమావేశాలకు కీలక నేతలు ఎందుకు దూరంగా ఉంటున్నారు? క్యాడర్ రోజురోజుకూ ఎందుకు నిరుత్సాహపడుతున్నది?’ అంటూ తలంటినట్టు సమాచారం. దీంతో బండి సంజయ్ అయోమయంలో పడ్డారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.