హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఘోర పరాజయం తప్పదని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఉత్తరప్రదేశ్లో మాత్రమే కాదని, శనివారం పోలింగ్ జరుగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ బీజేపీ ఓటమి ఖాయమని చెప్పారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 100 స్థానాల్లో పోటీ చేయనుందని అసదుద్దీన్ తెలిపారు. యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తెలంగాణ టుడే పత్రికా ప్రతినిధిలో మాట్లాడిన అసదుద్దీన్.. బీజేపీ విభజన రాజకీయాలను దేశవ్యాప్తంగా ప్రజలంతా చాలా దగ్గరి నుంచి గమనిస్తున్నారని చెప్పారు. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. త్రిపురలో 15 మసీదులను ధ్వంసం చేసినా.. ఘటనకు బాధ్యులైన వారిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇంతవరకు ముస్లింలకు 10 ఇండ్లు కూడా కేటాయించలేదని విమర్శించారు.
తెలంగాణలో బహుజనవాదాన్ని, లౌకిక కట్టుబాటును చెదరగొట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందని అసదుద్దీన్ ఆరోపించారు. హుజూరాబాద్ ప్రజలకు బీజేపీ విభజన రాజకీయాలపై మంచి అవగాహన ఉన్నదని, ఈ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటర్లు గుణపాఠం చెబుతారని అన్నారు. కేంద్ర సర్కారు తెలంగాణ విషయంలో పక్షపాత వైఖరి అవలంభిస్తున్నదని, ముఖ్యంగా ఆర్థిక సహకారం అందించడంలో వివక్ష చూపుతున్నది అసదుద్దీన్ మండిపడ్డారు.