హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే వసూళ్లకు తెరలేపిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. ఢిల్లీ పెద్దలు టార్గెట్ పెట్టారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులను, బిల్డర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో దోచుకున్న డబ్బును ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పంచారని, ఇదే తరహాలో ఇప్పుడు తెలంగాణలో డబ్బు దోచుకొని దేశమంతా పంచేందుకు సిద్ధం అవుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి సూట్కేసులు మోసేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల గురించి బీజేపీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడానని, శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం అవుతుందని తెలిపారు. అన్ని వర్గాల నుంచి బీజేపీలో చేరేందుకు ఉత్సాహంగా వస్తున్నారని, ఎవరొచ్చినా చేర్చుకుంటామని అన్నారు.
బీజేపీ ఈ నెల 16 లోగా ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నది. బీజేపీ ముఖ్యనేతలు ఇటీవలే రాష్ట్రంలోని బీజేపీ మండల అధ్యక్షులు, ఆపై స్థాయి నేతల నుంచి అభ్యర్థుల గురించి ఆరా తీశారు. ఈ మేరకు ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు ఆశావహుల జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం.