Kishan Reddy | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే వసూళ్లకు తెరలేపిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఢిల్లీ పెద్దల పేరు చెప్పి బెదిరిస్తున్నారని, డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.
బుధవారం కిషన్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ.. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడినట్లు తెలిపారు. శుక్రవారం ఎన్నికల కమిటీ సమావేశం అవుతుందన్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికై అభిప్రాయ సేకరణ జరిగిందన్నారు. ఇందులో నుంచి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి 3 నుంచి 5 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. త్వరలో తుది జాబితా విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి చాలా అనుకూలంగా ఉందన్నారు. 17 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు. అన్ని వర్గాల నుంచి బీజేపీలో చేరేందుకు ఉత్సాహంగా వస్తున్నారని, ఎవరొచ్చినా చేర్చుకుంటామని అన్నారు.