మహబూబాబాద్ : రాష్ట్రంలో రైతులను అయోమయానికి గురి చేస్తూ.. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. యాసంగి పంట కొంటారా? లేదా ముందు స్పష్టం చేసి, తర్వాత మిగిలిన పనులు చేయాలని హితవు పలికారు.బీజేపీ మెడలు వంచి రైతుల ప్రయోజనాలు కాపాడడంలో ముందుటామని మంత్రి స్పష్టం చేశారు. బుధవారం మహబూబాబాద్లో మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు.
బీజేపీ ప్రభుత్వం యాసంగి పంట కొంటదా లేదా ముందు స్పష్టం చేయాలన్నారు. నేను రైతులను పరామర్శిస్తా.. కొనుగోలు కేంద్రాలని సందర్శిస్తా అని దిక్కుమాలిన కార్యక్రమం పెట్టుకుని బండి సంజయ్ రోడ్ల మీద తిరుగుతుంటే నీ మాటలకు, చేతలకు పొంతనలేదని రైతులు తిరగబడుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
టీఆర్ఎఎస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వారిలో చాలామంది రైతులున్నారు. నిజంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేయాలనుకుంటే, అడ్డుకోవాలనుకుంటే ఏ ఊరు తిరగవు అన్నారు. ఇలాంటి తెలివితక్కువ మాటలు బంద్ చేసి, రోడ్ల మీద తిరగడం బంద్ చేసి ఢిల్లీలో తిరుగు అని బండికి హితవు పలికారు.
దమ్ముంటే కేంద్రాన్ని ఒప్పించు. స్పష్టమైన హామీ ఇప్పించి ఇక్కడి రైతులకు మేలు చేయాలన్నారు. మీమెడలు వంచే వరకు మా దీక్ష సాగుతుందన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న వారి మెడలు వంచడం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ ఆంగోతు బిందు, కురవి జడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, బయ్యారం పీఏసీఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.