మంచిర్యాల, జూలై 20, నమస్తే తెలంగాణ/మంచిర్యాల టౌన్ : మంచిర్యాలలో బీజేపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టీఆర్ఎస్ నాయకులపై దాడికి తెగబడ్డారు. పాలు, పాల ఉత్పత్తులపై కేంద్రప్రభుత్వం జీఎస్టీ విధించడంపై నిరసిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా రాస్తారోకో మీదికి దూసుకురాగా, టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకొన్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు లక్ష్యంగా బీజేపీ గూండాలు ఆయనపైకి కర్రలు, జెండాలు విసిరారు.
ఈ ఘటనలో టీఆర్ఎస్ కార్యకర్తలు బింగి ప్రవీణ్, నాగులపల్లి సాగర్, షేక్ ఇమ్రాన్, గాండ్ల సంజయ్, సుంకరి రమేశ్ గాయపడ్డారు. వీరు ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బీజేపీ నాయకుల గూండాయిజాన్ని సహించబోమని, తాము శాంతియుతంగా రాస్తారోకో చేస్తుంటే తమ పైకి దూసుకురావడం దారుణమని టీఆర్ఎస్ యూత్ నాయకుడు, ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్రావు మండిపడ్డారు.