ఎల్కతుర్తి, జనవరి 4 : తెలంగాణలో బీజేపీ నుంచి నలుగురు ఎంపీలు గెలిచినా రాష్ర్టానికి కేంద్రం నుంచి ఏమీ తేలేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు. ఢిల్లీలో ఉండి అభివృద్ధి నిధులు తేవాల్సిన ఎంపీలు.. రాష్ట్రంలో ఉంటూ ప్రజలు అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. మేకిన్ ఇండియా నినాదంతో గెలిచిన నరేంద్రమోదీ ఇప్పుడు సేల్ ఇండియా నినాదంతో ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో దేశానికి ఏంచేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ఏటా కోటి ఉద్యోగాలు, సామాన్యుల ఖాతాల్లో వేస్తామన్న రూ.15 లక్షలు ఎక్కడ? అని నిలదీశారు. బీజేపీ సర్కారు పాలనలో రోడ్లను కూడా అమ్మే ఆలోచన చేస్తున్నారని.. మున్ముందు అంబానీ, అదానీ రైళ్లు కూడా రావొచ్చని ఎద్దేవాచేశారు. 2019లో పుల్వామా దాడి జరుగకపోయి ఉంటే మోదీ మళ్లీ ప్రధాని అయ్యేవారు కాదన్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ దివాళా తీయడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు ప్రజలు చూశారని చెప్పారు. బీజేపీ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాము పార్లమెంట్లో కొట్లాడి ఎయిమ్స్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలను రాష్ర్టానికి తీసుకొచ్చామని గుర్తుచేశారు. బండి సంజయ్ది పోలీసులపై దాడి చేసే దీక్షగా అభివర్ణించారు.