ఆదాయ పన్ను విభాగంలో పని చేస్తున్న ఇద్దరు సీనియర్ అధికారులను, పన్నుల విభాగంలోనే అతి ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్న మరో కీలక అధికారిని, కేంద్రం పరిధిలో ఉండే మరో రెండు కీలక విభాగాల్లోని ఇద్దరిని తెలంగాణ నుంచి బదిలీ చేసి వేరే చోటుకు పంపాల్సిందిగా రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: అధికారం కోసం యావ ఎంతకైనా దిగజారుస్తుంది. సిద్ధాంతాలను వదిలేసినప్పుడు ఒక రాజకీయ పార్టీ పతనంవైపే ప్రయాణిస్తుంది. ప్రశ్నలకు జవాబులు చెప్పలేనప్పుడు అధికార పక్షం అణచివేతనే నమ్ముకుంటుంది. పాలనలో సమర్థత చూపలేనప్పుడు లొంగదీసుకోవడమే ఏకైక మార్గంగా కనిపిస్తుంది. రాజకీయ ప్రత్యర్థుల ప్రశ్నలకు జవాబులు చెప్పలేని బీజేపీ, వారిని భయపెట్టి, బెదిరించి లొంగదీసుకోవడానికి ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలను విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న బీజేపీ ఇప్పుడు మరోరకమైన పన్నాగానికి తెర తీసినట్టు ఢిల్లీలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఈ కుట్రకు టార్గెట్ అఖిల భారత స్థాయి అధికారులు. ప్రతిపక్ష పాలిత రాష్ర్టాల్లోని కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు ఆ రాష్ట్ర బీజేపీ నేతల చెప్పుచేతల్లో ఉండి, వారి కనుసన్నల్లో పని చేయాలని కమలనాథులు ఆశిస్తున్నారు. వారి ద్వారా ఆ రాష్ట్ర పాలక పార్టీని సతాయించాలన్నది వారి వ్యూహం. అయితే క్రమశిక్షణతో కూడిన ట్రైనింగ్, విలువలతో కూడిన బోధన, నీతి, నిజాయతీ, ఇంటెగ్రిటీ కలిగిన అధికారులు, ఆయా రాష్ర్టాల్లో బీజేపీ నేతల నుంచి ఆదేశాలు స్వీకరించడానికి, వారు చెప్పినట్టు చేయడానికి సిద్ధంగా లేరు. దీనిపై ఆయా రాష్ర్టాల్లోని బీజేపీ నేతలు కన్నెర్ర చేస్తున్నారు. వారిని బదిలీ చేసి తమకు అనుకూలమైన, ఐడియలాజికల్గా సారూప్యత ఉన్న అధికారులను తమకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ సిఫారసులు చేస్తున్నారు. తాజాగా తెలంగాణలోనూ ఇలాంటి కుట్ర ఒకటి జరుగుతున్నట్టు ఢిల్లీలోని అఖిలభారత స్థాయి అధికార వర్గాలు తెలిపాయి.
వాళ్లను పంపండి.. మనవాళ్లను తెండి
ఆదాయ పన్ను విభాగంలో పని చేస్తున్న ఇద్దరు సీనియర్ అధికారులను, పన్నుల విభాగంలోనే అతి ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్న మరో కీలక అధికారిని, కేంద్రం పరిధిలో ఉండే మరో రెండు కీలక విభాగాల్లోని ఇద్దరిని తెలంగాణ నుంచి బదిలీ చేసి వేరే చోటుకు పంపాల్సిందిగా రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రానికి, బీజేపీ అధిష్ఠానానికి సిఫారసు చేస్తున్నట్టు అవి వెల్లడించాయి. విచిత్రం ఏమిటంటే ఈ అధికారుల నిష్పాక్షికత, సమర్థత, వ్యక్తిగత సమగ్రత మీద వారికి ఎలాంటి అనుమానాలు అభ్యంతరాలు లేకపోవడం. “ఈ ఐదుగురు అధికారులూ మంచివాళ్లే. నిష్పాక్షికంగా ఉంటారు. కానీ వాళ్లు అలా ఉండడం వల్ల మన రాజకీయ ప్రయోజనాలు నెరవేరడం లేదు. వారికి మన సైద్ధాంతిక భావజాలం ఏమాత్రం లేదు. అందువల్ల వారు మనకు పూర్తి అనుకూలంగా పని చేయడం లేదు. అందువల్ల వాళ్లను మార్చి, మన వాళ్లను తెచ్చుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసరం” అని తెలంగాణ బీజేపీ నేతలు కేంద్ర సర్కారుకు విన్నవిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
తెలంగాణను బద్నాం చేసేందుకు కుట్ర
ఆయా విభాగాల సారథులుగా ఉండేవాళ్లు బీజేపీ సైద్ధాంతిక భావజాలం కలిగి ఉండాలనీ, అప్పుడే తమ ప్రయోజనాలు నెరవేరుతాయని రాష్ట్ర బీజేపీ నేతలు నిస్సిగ్గుగా కేంద్రానికి నివేదిస్తున్నట్టు సమాచారం. ఈ ఐదుగురు అధికారులనూ మార్చి, తమకు పూర్తి అనుకూలంగా ఉండేవాళ్లను నియమించాలని వారు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. ఈడీ, ఐటీ దాడులంటూ ఊదరగొడుతున్న తెలంగాణ బీజేపీ నేతల మాటలకు ఏ సాక్షమూ లేని కారణంగా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఎలాగైనా తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఈ బదిలీల ప్రహసనానికి బీజేపీ కుట్ర పన్నుతుంది. కొత్తగా వచ్చే అధికారులతో వేధింపులకు తెర తీయాలని యోచిస్తుంది.
అఖిలభారత స్థాయి అధికారుల ఆందోళన
అధికార దుర్వినియోగంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పెద్దలు ఇప్పటికే అన్ని హద్దులనూ దాటేసారు. ఆయా రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు కూడా కేంద్రం బాటలోనే నడుస్తూ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు విపక్ష పాలిత రాష్ర్టాల్లోని బీజేపీ నేతలు కూడా అధికారులను లొంగదీసుకోవడానికి ప్రయత్నించడం దారుణమని అఖిలభారత స్థాయి అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం కామారెడ్డి కలెక్టర్తో మాట్లాడిన తీరు కూడా వారిని బెదిరించి లొంగ దీసుకోవాలనే రీతిలోనే ఉందని వారు అభిప్రాయపడ్డారు. “ఐఏఎస్లు నిర్వహించాల్సిన పోస్టుల్లో ఇప్పటికే అనేకం ఖాళీగా ఉన్నాయి. కేంద్రం వీటిని నింపడం లేదు. మరోవైపు ల్యాటరల్ ఎంట్రీ పేరుతో జాయింట్ సెక్రటరీ స్థాయిలో సంఘ్పరివార్ వాళ్లను పెట్టే ప్రయత్నం జరుగుతున్నది. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు నిష్పాక్షికంగా పనిచేసే అధికారులను కూడా పక్కనబెట్టి, తాబేదార్లను తెచ్చుకునే ధోరణి మొదలైతే ఇక ఈ దేశాన్ని దేవుడే కాపాడాలి” అని పేరు చెప్పడానికి నిరాకరించిన సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
ఇలాగైతే వ్యవస్థ ధ్వంసమవుతుంది
“ఐఏఎస్ అధికారులకు ఉండాల్సింది నీతి, నిజాయతీ, పాలనా దక్షత, సమర్థత. అంతేతప్ప రాజకీయ భావజాలం, రాజకీయ సైద్ధాంతిక దృక్పథం కాదు. ఇప్పుడున్న పాలకపార్టీకి అది కూడా తెల్వదు. ఇది తాత్కాలికంగా ఆ పార్టీకి లబ్ధి చేకూర్చవచ్చు. కానీ దీర్ఘకాలంలో ఇది అఖిలభారత స్థాయి అధికారుల వ్యవస్థను ధ్వంసం చేస్తుంది” అని మరో రిటైర్డ్ అధికారి ఆవేదన వెలిబుచ్చారు. తాము చెప్పినట్టల్లా ఆడడం లేదనే నెపంతో ఆర్థిక శాఖ కార్యదర్శి గార్గ్ని 2019లో మోదీ ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణంగా రిటైర్మెంట్కు ముందు ఉన్నతస్థాయి అధికారులను బదిలీ చేయరు. గార్గ్ మరో ఏడాదిలో రిటైర్ కాబోతున్నాడనగా, మోదీ ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో ఆయన మనస్తాపంతో ఉత్తర్వులు అందిన అరగంటలోనే రాజీనామా చేశారు.
అరవింద్ పనగరియా, అర్వింద్ మరియం వంటి వారికీ మోదీ సర్కారులో ఇటువంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఈ జాడ్యం ఇప్పుడు రాష్ర్టాలకూ పాకుతున్నదని ఢిల్లీలోని అధికార వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. ఇదే పద్ధతి కొనసాగితే నిష్పాక్షికంగా, వ్యక్తిగత విలువలకు కట్టుబడి ఉండేవారెవరూ ప్రభుత్వంలో మిగలరనీ, దీనివల్ల వ్యవస్థే కుప్పకూలిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. అఖిల భారత స్థాయి సర్వీసుల్లో ఉన్న అధికారులు దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉందని, అవసరమైతే సంఘటితంగా గొంతెత్తాలని రిటైర్డ్ అధికారి ఒకరు సూచించారు.