హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్ర బీజేపీ (BJP) సమాయత్తమవుతున్నది. అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించిన పార్టీ అధిష్టానం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఎన్నికల కమిటీ ఢిల్లీలో భేటీ అయింది. పార్లమెంటు అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నది. ఈ నెల 16లోపే ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో మెజార్టీ సీట్లకు అభ్యర్థుల పేర్లు మొదటి జాబితాలోనే ఉండే అవకాశం ఉన్నది.
సికింద్రాబాద్ స్థానానికి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి స్థానానికి బూర నర్సయ్య గౌడ్, మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ అభ్యర్థిత్వాలపై అభిప్రాయాలను సేకరిస్తున్నది. అదేవిధంగా పెద్దపల్లి, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, వరంగల్, జహీరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. ఇక మల్కాజిగిరి, మెదక్, హైదరాబాద్ స్థానాల్లో అభ్యర్థుల విషయమై కేంద్ర ఎన్నికల కమిటీకే నిర్ణయాన్ని వదిలేశారు.