ఉత్తర హైదరాబాద్కు ఐటీ
అభివృద్ధిని ఓర్వలేక కుల, మత పంచాయితీలు
మతోన్మాదుల దుశ్చర్యలను తిప్పి కొట్టాలి
పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు
కండ్లకోయలో ఐటీ గేట్వే పార్కుకు శంకుస్థాపన
వేల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడి
6 లక్షల చదరపు అడుగుల్లో పార్కు ఏర్పాటు
మేడ్చల్, ఫిబ్రవరి 17 : సల్లంగా ఉన్న తెలంగాణలో మతం, కులం పేరుతో చిచ్చుపెట్టి గందరగోళం సృష్టించేందుకు మతోన్మాదులు కుట్రలు పన్నుతున్నారని ఐటీ, పురపాలక, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని వారు కుల, మత పంచాయతీలు పెట్టాలని చూస్తున్నారని ఆయన బీజేపీ నేతలను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఓవైపు వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ రంగాలు అభివృద్ధి చెందుతూ ప్రశాంతంగా ఉన్న తెలంగాణను అల్లకల్లోలంచేసే మతోన్మాదుల పన్నాగాలను తిప్పి కొట్టాల్సిన అవసరమున్నదని పిలుపునిచ్చారు. ప్రజల సుఖ సంతోషాలకోసం సీఎం కేసీఆర్ కృషిచేస్తుంటే ఓర్వలేని వారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయలో రూ.250 కోట్లతో నిర్మించనున్న గేట్ వే ఐటీ పార్కు, పూడూరులో రూ.5 కోట్లతో నిర్మించనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్కు ఉత్తరాన ఐటీ విస్తరణ ఆరంభం మాత్రమేనని త్వరలో దుండిగల్ తదితర ప్రాంతాలకు విస్తరిస్తామని, ఇందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. గేట్ వే ఐటీ పార్కు తెలంగాణకు మరో కలికితురాయి అన్నారు. దేశచరిత్రలో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఐటీ టవర్ను నిర్మిస్తున్న ఘనత తెలంగాణకే దక్కుతుందని చెప్పారు. హైదరాబాద్ నలువైపులా ఐటీ విస్తరణలో భాగంగా ఈ నెల 13న ఉప్పల్లో 19 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జెన్ప్యాక్ కంపెనీకి శంకుస్థాపన జరిగిందని తెలిపారు. దీనిద్వారా 15 వేల ఉద్యోగాలు లభించనున్నాయని చెప్పారు. గేట్వే పార్కుతో వేల మందికి ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు. గేట్వే ఐటీ పార్కుకు చక్కని రవాణా సదుపాయం ఉన్నదని, ఎంఎంటీఎస్, జాతీయ రహదారులు ఆనుకొని ఉండటం కలిసివచ్చే అంశమని చెప్పారు. పారిశ్రామికవేత్తల కోసం కండ్లకోయ ప్రాంతంలో త్వరలో టీ హబ్ను ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. మరో పెద్ద సంస్థ ఎంఆర్ఎఫ్ వెయ్యి కోట్ల పెట్టుబడితో తమ సంస్థను నెలకొల్పేందుకు తనను ఈ రోజే సంప్రదించిందని వెల్లడించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల కాళేశ్వరం
ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరంను నిర్మించిన ఘనత తెలంగాణ రాష్ర్టానికి దక్కిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. సముద్రమట్టానికి 82 మీటర్ల దిగువన ఉన్న గోదావరి నీటిని 612 మీటర్ల ఎత్తులో గజ్వేల్ ప్రాంతంలోని కొండపోచమ్మ సాగర్కు తరలించి, మేడ్చల్తోపాటు హైదరాబాద్కు తాగునీరు అందించేందుకు కాళేశ్వరంప్రాజెక్టు దోహదపడుతున్నదని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ర్టాలకు పాఠాలు చెప్పే విధంగా కేసీఆర్ వినూత్న పథకాలు అమలుచేస్తున్నారని అన్నారు.
జిల్లాకు ఐటీ పార్కు రావడం అదృష్టం: మంత్రి మల్లారెడ్డి
ఐటీ రంగంలో అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్కు గేట్వేగా ఉన్న మేడ్చల్, మల్కాజ్గిరి ప్రాంతంలో ‘ఐటీ గేట్వే పార్కు’ రావడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున పార్కుకు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉన్నదని చెప్పారు. మరిన్ని ఐటీ కంపెనీలు వచ్చేందుకు మంత్రి కేటీఆర్ విశేష కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం ఐటీ టవర్స్ ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ చేసుకొన్నవారికి మంత్రి కేటీఆర్ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, నవీన్కుమార్ రావు, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కేవీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకటనర్సింహారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్, మున్సిపాలిటీ చైర్పర్సన్లు మద్దుల లక్ష్మీరెడ్డి, మర్రి దీపికారెడ్డి, కైటీయా అధ్యక్షుడు ఓరుగంటి వెంకట్, ఐటీ సీఆర్వో అమర్నాథ్రెడ్డి, టీఆర్ఎస్ నియోజవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి, భద్రారెడ్డి, ఎంపీపీ రజితారెడ్డి పాల్గొన్నారు.