కేసీఆర్కు అధికారమిస్తే వారంలో అంతా సరి చేస్తారు
నూకలు తినమన్న కేంద్రానికి నూకలు లేకుండా చేస్తాం
సిరిసిల్ల మహాధర్నాలో బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్
నేడు రైతుల ఇండ్లపై నల్ల జెండాలు ఎగరేయాలని పిలుపు
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 7 : నూకలు తినాలంటూ తెలంగాణ ప్రజలను అవహేళన చేసిన కేంద్ర ప్రభుత్వానికి నూకలు లేకుండా చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. దేశానికి బీజేపీ ప్రభుత్వం గుదిబండలా తయారైందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని నడిపించడం చేతగాకపోతే సమర్థుడైన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు అప్పగించాలని, ఒక్క వారంలో వ్యవస్థనంతా మార్చివేస్తారని ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. ధాన్యం సేకరణపై కేంద్రం వివక్షకు వ్యతిరేకంగా సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ గురువారం చేపట్టిన మహాధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన జరిగిన ధర్నాలో కేటీఆర్ మాట్లాడుతూ నమో అంటే నమ్మించి మోసం చేసే నరేంద్రమోదీ అని ధ్వజమెత్తారు. కేంద్రంపై ఉద్యమంలో భాగంగా శుక్రవారం రాష్ట్రంలోని ప్రతి రైతు ఇంటిపై నల్ల జెండాలు ఎగురవేసి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు తగులబెట్టాలని పిలుపునిచ్చారు.
కిషన్రెడ్డి, బండి సంజయ్ ఎటు పోయారు?
రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రమేయం లేకుండా కేంద్రంతో ప్రతి గింజనూ కొనిపించే బాధ్యత తీసుకొంటామని చెప్పిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు ఎటు పోయారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను పదేపదే అవమానిస్తున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. యూపీఏ హయాంలో పెట్రోలు ధరలు పెరిగితే నాడు ప్రతిపక్షంలో ఉన్న స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, నరేంద్రమోదీ చేసిన విమర్శల వీడియోలను దీక్షా శిబిరంలో కేటీఆర్ ప్రదర్శించారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్పై దుమ్మెత్తిపోసిన బీజేపీ నేడు పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా పెంచుతుందని నిలదీశారు. మతవాద బీజేపీ దేశానికి అరిష్టమని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు విమర్శించారు.బీజేపీని అధికారం నుంచి తొలగించి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ తదితరులు పాల్గొన్నారు.