హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ విధానాలతోనే మహారాష్ట్ర ప్రజల జీవితాలు మారుతాయని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. బుధవారం మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఆమె పర్యటించారు. ఎన్సీపీ, శివసేన, బీజేపీ సహా పలు పార్టీలకు చెందిన నాయకులు ఆమె సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. శివసేన పార్టీ నేత అజయ్ చాటేతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు బుధవారం బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి సత్యవతి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
మహారాష్ట్రలో అన్ని రకాల వనరులున్నా ప్రభుత్వాలు ప్రజలకు కనీస వసతులను కల్పించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ పిలుపును అందుకొని బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని కోరారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు విఠల్రావు జాదవ్, మాజీ ఎంపీ హరిభావూ రాథోడ్, ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపూరావ్, ట్రైకార్ చైర్మన్ రామచంద్రనాయక్, జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబాల్ నాయక్, రాష్ట్ర సీనియర్ నేత రాంబాబు నాయక్, మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకురాలు సింపల్ రాథోడ్, బంజారా జేఏసీ రాష్ట్ర నాయకులు అంబు రాథోడ్, చైర్మన్ ఇంద్రవెల్లి జాధవ్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.