హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): దేశంలో రిజర్వేషన్లను రద్దు చేయబోతున్నట్టు నిరాధారమైన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డిపై దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదును స్వీకరించి, విచారణ చేపట్టేలా కింది కోర్టుకు ఉత్తర్వులు జారీ చేయాలంటూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణను జూన్ 4కి వాయిదా వేసింది. ఇటీవల కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘జన జాతర’ సభలో సీఎం రేవంత్ నిరాధార ఆరోపణలు చేశారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ప్రైవేటు ఫిర్యాదుపై కింది కోర్టు నిర్ణయం తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వెంకటేశ్వర్లు పిటిషన్పై జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి గురువారం విచారణ జరిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేయనున్నదని, రాజ్యాంగాన్ని మార్చివేయబోతున్నదని కొత్తగూడెం సభలో రేవంత్ నిరాధారమైన ఆరోపణలు చేశారని, తద్వారా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు. ఈ నేపథ్యంలో రేవంత్పై బీజేపీ చేసిన ఫిర్యాదుపై కింది కోర్టు తగిన ఉత్తర్వులు జారీ చేయలేదని, ఆ ఫిర్యాదుపై విచారణను సుదీర్ఘంగా జూలైకి వాయిదా వేసిందని తెలిపారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పందిస్తూ.. బీజేపీ పిటిషన్పై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నివేదించేందుకు సమయం కావాలని ఆయన కోరడంతో.. తదుపరి విచారణను జూన్ 4కు వాయిదా పడింది.