హైదరాబాద్ సిటీ బ్యూరో, మొయినాబాద్/శంషాబాద్ రూరల్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ‘ఒక్కొక్కరికీ వంద కోట్లు ఇస్తాం.. కావాల్సిన సివిల్ కాంట్రాక్టులు అప్పజెప్తాం.. ఒక్కసారి బీజేపీలోకి వస్తే చాలు.. అడిగిన పదవులు కట్టబెడతాం.. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది..’ ఇదీ ఢిల్లీ నుంచి వచ్చిన ఉత్తరకాశీ స్వామి రామచంద్రభారతి తెలంగాణ ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఆఫర్! వీరికి మధ్యవర్తిగా హైదరాబాద్కు చెందిన వ్యాపారి వ్యవహరించారు. తమను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలివి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టులు, ఇతర పదవులు ఇస్తామంటూ ముగ్గురు బీజేపీ దూతలు పోలీసులకు బుధవారం రాత్రి అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రోహిత్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మొయినాబాద్ పోలీసులు కేసు నమోదుచేశారు.
బాధితులు (ఎమ్మెల్యేలు), పోలీసుల కథనం ప్రకారం నెలరోజుల క్రితమే (సెప్టెంబర్ 26, 2022) ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి అలియాస్ సతీశ్శర్మ.. హైదరాబాద్కు చెందన నందకుమార్ అనే వ్యక్తి ద్వారా ఎమ్మెల్యే రోహిత్రెడ్డిని కలుసుకొన్నారు. ఈ ఇద్దరూ బీజేపీకి చెందిన వారు. టీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరాలని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయాలని కోరారు. ఇందుకు ప్రతిఫలంగా రూ.100 కోట్లు అందించడంతోపాటు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సివిల్ కాంట్రాక్టులు, ఇతర పదవులు మీకు వచ్చేలా చూస్తామని చెప్పారు. ఒకవేళ బీజేపీలో చేరకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలతో మీపై కేసులు నమోదు చేయించి, ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తామంటూ బెదిరించారు. టీఆర్ఎస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరించారు. వారి బెదిరింపులు, ప్రలోభాలకు లొంగకూడదని, అనైతిక చర్యలకు పాల్పడకూడదని ఎమ్మెల్యే నిర్ణయించుకొన్నారు. అక్టోబర్ 26న కలిసేందుకు వస్తున్నామని నందకుమార్ ద్వారా రోహిత్రెడ్డికి కబురుపెట్టారు. తమ ఆఫర్కు వచ్చేవారు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్లను కూడా తీసుకొని రావాలని, ఒక్కొక్కరికి ముందుగా రూ.50 కోట్లు పంపిస్తామని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే అజీజ్నగర్లోని తన ఫామ్హౌస్లో కలుసుకొందామని, తనతోపాటు వచ్చేందుకు మరో ముగ్గురు సిద్ధంగా ఉన్నారని రోహిత్రెడ్డి తెలిపారు. ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి అలియాస్ సతీశ్ శర్మ, నందకుమార్, తిరుపతికి చెందిన సింహయాజి బుధవారం ఫామ్హౌస్కు వచ్చారు. అక్కడికి చేరుకొన్న నలుగురు ఎమ్మెల్యేలతో నిందితులు సుదీర్ఘ చర్చలు జరిపారు. టీఆర్ఎస్కు రాజీనామా చేసి, తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరచడంలో తమకు సహకరించాలని డబ్బు ఎరచూపారు. తమకు లంచం ఇవ్వజూపినందుకు, ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కుట్రలుచేసి, అనైతిక, చట్ట వ్యతిరేక చర్యలను ప్రోత్సహిస్తున్న వారితోపాటు ఈ కుట్రల వెనుక ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తన ఫిర్యాదులో పోలీసులను కోరారు. దీంతో పోలీసులు సెక్షన్ 120-బీ, 171-బీ ఆర్/డబ్ల్యూ 171-ఈ, 171-బీ ఆర్/డబ్ల్యూ 171-ఈ, 506 ఆర్/డబ్ల్యూ 34 ఐపీఎసీ, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 8 ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. రాజేంద్రనగర్ ఏసీపీ రాజేంద్రంకు దర్యాప్తు బాధ్యత అప్పగించారు.
నోటీసులిచ్చి విచారించండి
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి విచారించాలని నాంపల్లి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి రాజగోపాల్ ఆదేశించారు. పోలీసులు ముగ్గురు నిందితులను గురువారం ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా.. రిమాండ్ విధించేందుకు నిరాకరించారు. లంచం డబ్బులు లేకపోవడంతో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వర్తించదని, రిమాండ్ అవసరం లేదని పేర్కొన్నారు.
అర్ధరాత్రి స్టేషన్కు తరలింపు
మెయినాబాద్ ఫామ్హౌస్లో బుధవారం రాత్రి అరెస్టయిన నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజీలను శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్కు తరలించారు. గురువారం ఉయం తిరిగి పోలీసులు ఫామ్ హౌస్కు చేరుకొని సోదాలు చేశారు. నిందితుల అరెస్ట్కు సంబంధించిన ప్రక్రియను ఫామ్ హౌస్ నుంచే పూర్తి చేశారు. కంప్యూటర్లు, జిరాక్స్ యంత్రాలను ఫామ్ హౌస్ వద్దకే పోలీసులు తెచ్చుకొన్నారు. శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్లో నిందితులను డీసీపీ జగదీశ్వర్రెడ్డి విచారించారు.