హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీజేపీలో లోక్సభ ఎన్నికల కోలాహలం మొదలైంది. బీజేపీ కేంద్ర నాయకత్వం దేశవ్యాప్తంగా వంద మంది సిట్టింగ్ ఎంపీలకు రాబోయే లోక్సభ ఎన్నికల్లో సీట్లు నిరాకరించే అవకాశం ఉన్నదంటూ వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏమిటనే దానిపై జోరుగా చర్చ కొనసాగుతున్నది. రాష్ట్రంలో బీజేపీ నుంచి నలుగురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఎవరికి మళ్లీ టికెట్ ఇస్తారు? ఎవరికి నిరాకరిస్తారన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్తో గట్టిపోటీ ఉంటుందని, పోటీని తట్టుకొని నిలబడేవారికి ప్రాధాన్యం ఉంటుందని ముఖ్య నేతలు చెప్తున్నారు.
ఉత్తర తెలంగాణ సీట్లపై జోరుగా చర్చ
బీజేపీ సిట్టింగ్ ఎంపీల్లో ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సోయం బాపూరావుకు మళ్లీ టికెట్ ఇస్తారా లేదా అన్న చర్చ జోరుగా సాగుతున్నది. ఆయన గతంలో ఆదివాసీ ఉద్యమాలతో విజయం సాధించడం సులువైంది. కానీ, ఐదేండ్లుగా పార్టీ తరఫున ఆయన పెద్దగా కార్యక్రమాలు చేపట్టలేదని, ఆయనకు ఇటీవల బోథ్ శాసనసభ టికెట్ కేటాయిస్తే గెలవలేకపోయారన్న భావన ఆ పార్టీలో ఉన్నది. మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కూడా ఇక్కడి నుంచి లోక్సభ టికెట్ ఆశిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కి మళ్లీ టికెట్ ఇస్తారా, ఆయనను మరో స్థానానికి మారుస్తారా అన్న చర్చ జరుగుతున్నది. కరీంనగర్లో మళ్లీ బండి సంజయ్కే టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు చెప్తుండగా, ఇదే సీటును మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా ఆశిస్తున్నారు. ఇప్పటికే తన అభిమతాన్ని పార్టీ అధిష్ఠానం పెద్దలతో చెప్పినట్టు సమాచారం. కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్రెడ్డితో మళ్లీ పోటీ చేయిస్తారా.. లేక పార్టీ అధ్యక్ష పదవిని ఆయనకే ఉంచి ఆ స్థానాన్ని వేరొకరికి ఇస్తారా అన్న చర్చ జరుగుతున్నది. ఇక్కడి నుంచి పార్టీ సీనియర్లలో ఎవరినైనా పోటీ చేయిస్తారని పలువురు భావిస్తున్నారు.
మల్కాజిగిరి సీటుకు పోటాపోటీ
హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు పోటీ చేయాలని భావిస్తుండగా మాజీ ఎంపీ చాడ సురేశ్రెడ్డి, సీనియర్ నేత మురళీధర్రావు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్లు కూడా ఇక్కడి నుంచి వినిపిస్తున్నాయి. కరీంనగర్ లోక్సభ స్థానం ఇవ్వకపోతే కనీసం మల్కాజిగిరి స్థానం నుంచైనా తనకు లోక్సభకు పోటీచేసే అవకాశం కల్పించాలని ఈటల రాజేందర్ కోరుతున్నట్టు తెలుస్తున్నది. చేవెళ్ల స్థానం నుంచి కొండా విశ్వేశ్వర్రెడ్డి పోటీచేయడం ఖాయమని, ఒకవేళ ఆయన చేయకపోతే వీరేందర్గౌడ్కు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్నది. మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ టికెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎంపీ జితేందర్రెడ్డి కూడా పోటీలో ఉన్నప్పటికీ ఆయన కుమారుడికి గత శాసనసభ ఎన్నికల్లో మహబూబ్నగర్ టికెట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జితేందర్రెడ్డికి కాకుండా తనకే టికెట్ ఇవ్వాలని డీకే అరుణ కోరుతున్నారు.