B Vinod Kumar | కరీంనగర్ : తెలంగాణ ప్రజలు రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఇన్నేండ్లలో వారు చేసింది శూన్యమని, అభివృద్ధి, విద్యకు సంబంధించి ఏ ఒక్క ప్రాజెక్టునూ సాధించలేకపోయారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మతోటలో వేంకటేశ్వర స్వామి ఆలయానికి నూతనంగా నిర్మించిన రాజగోపురాన్ని గురువారం మంత్రి గంగుల కమలాకర్తో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం దేశంలో 150 మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే ఒక్కటి కూడా తెలంగాణకు తీసుకురాలేకపోయారని దుయ్యబట్టారు. తెలంగాణలో మెడికల్ కళాశాలలకు కనీసం ఒక్క రూపాయి తీసుకురాలేదని విమర్శించారు. తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటైతే ఇప్పటి వరకు ఒక్క నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేయలేదని, దాంతో గ్రామీణ విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్కు త్రిబుల్ ఐటీ కావాలని అప్పటి కేంద్ర మంత్రి జవదేకర్ను కోరగా, ఇస్తామని హామీ ఇచ్చారని.. కానీ ఎన్నికల అనంతరం ఆ విషయాన్ని మరుగున పడేశారని విమర్శించారు. కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు లేకపోయినా సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను మంజూరు చేశారని గుర్తు చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు నాలుగు మెడికల్ కళాశాలు వచ్చాయని, అవి కూడా 500 పడకలతో కూడిన దవాఖానలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు.
ప్రతి జిల్లాలో దవాఖాన, మెడికల్ కళాశాల ఏర్పాటు మూలంగా ప్రజలకు ఎంతో మేలు జరగడంతో పాటుగా విద్యార్థులకు మెరుగైన ఉన్నత విద్య అందుతుందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను ముందంజలో ఉంచేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన వెంట కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్ ఉన్నారు.