హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్లో, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్రెడ్డికి అభద్రతాభావం కలుగుతున్నదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు.
పార్టీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత చూసి కాంగ్రెస్ మాట మారుస్తున్నదని విమర్శించారు. ప్రజల వ్యతిరేకతను దారి మళ్లించేందుకు తనపై కుట్ర జరుగుతున్నదంటూ సానుభూతి పొందేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.