DK Aruna | కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మా కంపెనీకి స్థలం ఇవ్వని గ్రామస్తులపై దాడి ఘటనను బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఫార్మా కంపెనీలపై ముఖ్యమంత్రికి ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. సంగారెడ్డి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న 16 మంది లగచర్ల బాధితులతో బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్ ములాఖత్ అయ్యారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ.. ఓటేసి గెలిపించిన జనాల కంటే మీకు ఫార్మా కంపెనీ ముఖ్యమా అని నిలదీశారు.
లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వబోమని రైతులు 8 నెలలుగా ఆందోళన చేస్తున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. బలవంతంగా భూములు లాక్కుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారని పేర్కొన్నారు. రైతులు ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారని చెప్పారు. వాస్తవంగా ప్రజాభిప్రాయ సేకరణకు రాకపోతే కలెక్టర్ ఒక్కరే ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. పోలీసుల వైఫల్యంతోనే లగచర్ల ఘటన జరిగిందని డీకే అరుణ అన్నారు. సీఎం రేవంత్ సోదరుడు అక్కడ ఉన్న రైతులను భయపెట్టారని తెలిపారు. భూములు ఎలాగైనా గుంజుకుంటామని చెప్పారన్నారు. ఘటన తర్వాత రాత్రి గ్రామాల్లోకి వచ్చి పోలీసులు ఇష్టం వచ్చినట్టు దాడి చేశారని పేర్కొన్నారు. గొడవ జరిగిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ వాళ్లను వదిలేసి మిగతా వాళ్లను అరెస్ట్ చేశారని అన్నారు. భూములు ఇవ్వమని చెబితే సీఎం రేవంత్ స్వయంగా వెళ్లి వాళ్లను కలిసి మాట్లాడితే బాగుండేదని అన్నారు. కానీ ఇవన్నీ చేయకుండా భయపెట్టి దాడులు చేపించి ఇలా చేయడం కరెక్టు కాదని స్పష్టం చేశారు.
సీఎం సోదరుడు అక్కడికి వెళ్ళవచ్చు కానీ నన్ను అక్కడికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారని డీకే అరుణ ప్రశ్నించారు. రైతులతో దౌర్జన్యంగా బెదిరించి సంతకాలు పెట్టించుకుంటున్నారని తెలిపారు. మీరు సీఎం అయితే మా నియోజకవర్గం బాగుంటుందని అనుకుంటే మీరు జనాలపై కక్ష కట్టారన్నారు. సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకని నిలదీశారు. ఓటేసి గెలిపించిన జనాల కాంటే మీకు ఫార్మా కంపెనీ ముఖ్యమా అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు.
సీఎం కొడంగల్ వాసులు కాదు వలస వచ్చారని డీకే అరుణ తెలిపారు. మీకు నచ్చిన వారికి కంపెనీలు అప్పజెప్పడానికే ఫార్మా కంపెనీలు పెడుతున్నారని మండిపడ్డారు. వెంటనే లగచర్ల బాధితులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంథాలు వద్దని.. నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ముఖ్యమని అన్నారు. గర్భిణీ స్త్రీ అని చూడకుండా ఇలా చేయడం దారుణమని అన్నారు. సీఎం రేవంత్ అహంకారం వీడాలని.. ఒప్పించి భూములు తీసుకోవాలని సూచించారు.