MP Arvind | హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా మొత్తం 30 సీట్లు కూడా దాటవని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాల వల్ల ఆ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటిందని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై ఇప్పటివరకు స్పష్టతలేదని మండిపడ్డారు. డిసెంబర్ 9 తర్వాత వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి కొంటామని రేవంత్ రెడ్డి చెప్పారని, ‘డిసెంబర్ 9 ఇంకా రాలేదా?’ అని ప్రశ్నించారు. రూ.2 లక్షల రుణమాఫీ ఎవరూ అడగకున్నా హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. రైతుబంధును ఖమ్మం మంత్రులు ఎత్తుకుపోయారని, రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తానని చెప్పారు.