Bandi Sanjay | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ విరుచుకుపడ్డారు. రైస్ మిల్లర్లతో కాంగ్రెస్ నేతలు కుమ్మక్కయారని అన్నారు. వేల కోట్లు దోచుకుని ఢిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు. నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పౌరసరఫరాల శాఖలో అతిపెద్ద కుంభకోణం జరిగిందని అన్నారు.
రైస్ మిల్లర్లతో కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కయ్యారని బండి సంజయ్ అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తనకు నమ్మకం ఉందని.. కానీ ఆయన కత్తి తీయడం లేదన్నారు. రైస్ మిల్లర్ల నుంచి ఏ నాయకుడికి ఎంత ముట్టిందో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ శాఖలో జరిగిన అక్రమాలు, అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని అన్నారు. పౌరసరఫరాల శాఖ నష్టాల్లో ఎందుకు ఉందో చెప్పాలని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు బీజేపీ చేయదని బండి సంజయ్ తెలిపారు. ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాన్ని కాంగ్రెస్ నేతలు ఇంకొకరికి ఇవ్వరని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నేతలు రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండదని విమర్శించారు.