హైదరాబాద్, మే 23, నమస్తే తెలంగాణ: లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ బీజేపీ హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైదరాబాద్లోని స్పెషల్ జేఎఫ్సీఎం కోర్టు వెంటనే విచారణ జరిపేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. బీజేపీ అధికారంలోకి వస్తే దళితులకు, గిరిజనులకు, బలహీనవర్గాల రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్రెడ్డి తప్పుడు అభియోగాలు చేసి బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కింది కోర్టులో ఫిర్యాదు చేశారు.
ఇది ఈ నెల 22న విచారణకు వచ్చిందని, న్యాయవాది హాజరయ్యేందుకు వీలుగా విచారణను కొద్ది సమయం వాయిదా వేయాలని కోరితే, అందుకు నిరాకరించిన జడ్జి జూలై 6కు వాయిదా వేయడాన్ని పిటిషనర్ తప్పుబట్టారు. కింది కోర్టులో చేసిన ఫిర్యాదులో ఫిర్యాదుదారుడు సంబంధిత రికార్డులను సమర్పించేలా స్పెషల్ జేఎఫ్సీఎంను ఆదేశించాలని హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యాంపై హైకోర్టు విచారణ జరపనున్నది.