హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు బంద్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పిచ్చివేషాలు కట్టిపెట్టాలని హెచ్చరించారు. వారిద్దరి మధ్య జరుగుతున్న గల్లీ కొట్లాట మరో అడుగు ముందుకు కదిలింది. ఈటల రాజేందర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రేవంత్రెడ్డిని బ్లాక్మెయిలర్గా అభివర్ణించారు.
‘నేను నా జీవితంలో ఒక్క ఆర్టీఐ దరఖాస్తు కూడా పెట్టలేదు. కడుతున్న బల్డింగుల దగ్గర ధర్నా చెయ్యలేదు’ అని అన్నారు. ‘ఆర్టీఐ దరఖాస్తులు పెట్టిన చరిత్ర మీది. ఆ రిపోర్ట్ వచ్చాక ఏం చేస్తారో కూడా తెలుసు’ అని ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి ధీరుడిలెక్క కొట్లాడుతాడని అనుకున్నానని, కానీ సందర్భం లేకపోయినా కన్నీళ్లు పెట్టుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్రెడ్డి చంద్రబాబు పంచన చేరారని, కరీంనగర్ మీటింగ్కు తెలంగాణ వ్యతిరేకులు ఎలా వస్తారని ప్రశ్నిస్తే తుపాకీ పట్టుకొని వచ్చారని గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో జైలుకు పోయాడే తప్ప ప్రజలకోసం కాదని ఎద్దేవా చేశారు. అతడితో తనకు పోలికేంటని మండిపడ్డారు. సీఎం కావాలని రేవంత్రెడ్డి ఆశపడ్డారని, అవి అడియాశలయ్యాయనే బాధతో ఏడ్చాడని ఎద్దేవా చేశారు. ‘నా ఇల్లు ముట్టడించే దమ్ముందా? రా తేల్చుకుందాం. మేము అనుకుంటే నువ్వు తిరుగగలవా?’ అని హెచ్చరించారు.