Telangana | సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి సవాలు విసిరారు. రాష్ట్రలో కాంగ్రెస్కు 14 సీట్లు తెప్పిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. అదే 14 ఎంపీ సీట్లు రాకపోతే సీఎం సీటు వదులుకుంటారా? అని ప్రశ్నించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 10 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పోలింగ్ బూత్ నాయకుల సమావేశంలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు 14 ఎంపీ సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. కానీ నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భూ కబ్జాలపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని విమర్శించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని భూముల అమ్మకాలను వ్యతిరేకించిన సీఎం రేవంత్రెడ్డి.. ఓ కంపెనీకి వేల కోట్ల రూపాయల భూములను ధారాదత్తం చేశారని అన్నారు. ఇందులో వందల కోట్ల చేతులు మారాయని ఆరోపించారు. తాను ఈ విషయాన్ని రుజువుతో నిరూపిస్తానని సవాల్ విసిరినా రేవంత్ నుంచి స్పందన లేదన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అటకెక్కాయని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు స్కీం పాలన మాదిరి కాకుండా స్కాంల పాలనగా మారిందని ఎద్దేవా చేశారు.