ఆ పార్టీతో దేశ రాజకీయ వ్యవస్థకే ముప్పు
సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా
హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీ అధికారంలో కొనసాగితే కేవలం వామపక్ష పార్టీలకే కాకుండా, రాజకీయ వ్యవస్థకే ముప్పు ఏర్పడుతుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా ఓడిపోతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఓటమికి సంకేతాలు ఇస్తుందనే విశ్వాసం వ్యక్తంచేశారు. పంజాబ్లో ప్రధాని పర్యటన సందర్భంగా ఏర్పడిన భద్రతా వైఫల్యంపై అనేక ప్రశ్నలు వస్తున్నాయని, వాటికి ప్రధాని కార్యాలయమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2022 బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల సంవత్సరంగా ఉండబోతున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే రైతులు సుదీర్ఘ పోరాటాల ద్వారా మోదీ ప్రభుత్వాన్ని మోకాళ్లపై నిలబెట్టారని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు గత నెలలో సమ్మె చేశారని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా 179 దేశాల్లో అత్యంత మత వివక్ష చూపే పది దేశాల సరసన భారతదేశం చేరినట్టు అంతర్జాతీయ సంస్థలు ప్రకటించాయని గుర్తుచేశారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్పాషా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనర్సింహ తదితరులు పాల్గొన్నారు.