సిద్దిపేట : తెలంగాణ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీశ్రావు (Minister Harish Rao) తెలిపారు. రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీ రైతుల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. ఆదివారం సిద్దిపేట(Siddipeta) మార్కెట్ యార్డ్ లో ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో బిందు సేద్యం(Drip Irrigation) పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రైతాంగ సంక్షేమానికి రైతు బంధు(Raitu Bandu), రైతు బీమా(Raitu beema), ఉచిత కరెంట్ తదితర పథకాలు ఎన్నో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల అకాల వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ. 10వేలను సీఎం కేసీఆర్(CM KCR) ప్రకటించారని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఏమి చేయడం లేదని విమర్శించారు. రైతు బిడ్డ సీఎం కేసీఆర్ ఉండగా రైతులు ఎలాంటి భయాదోళనకు గురి కావొద్దని అన్నారు.
తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్రం కొనబోమని చెప్పినా తామే కొనుగోలు చేశామని వెల్లడించారు. ఇక్కడ పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామని ఆయన అన్నారు. సత్తా ఉంటే బీజేపీ నాయకులు ఢిల్లీ నుంచి రైతులకు సహాయం కోసం డబ్బులు తీసుకురావాలని సవాలు విసిరారు. స్వపరిపాలనలో నిర్మించుకున్న ప్రాజెక్టుల వల్ల ఒక గుంట కూడ ఎండి పోవడం లేదని వివరించారు. గతంలో ఇతర రాష్ట్రాలకు, దేశాలకు కూలీలు వలసలు వెళ్లగా నేడు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నారని తెలిపారు.