హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ దిగొచ్చి రైతులు పండించిన వడ్లు కొనేదాకా ఉద్యమిస్తామని, నూకలు వారికే చెల్లుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తేల్చిచెప్పారు. రాష్ట్ర రైతాంగాన్ని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అహంకారంగా అవహేళన చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా గోయల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో వారు మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కించపరిచారని, అందుకు బీజేపీ రాష్ట్రంలో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ‘ప్రజలను నూకలు తినమనండి’ అనే రీతిలో గోయల్ మాట్లాడి తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించారని మండిపడ్డారు. అహంకారపూరితంగా చేసిన వ్యాఖ్యను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గోయల్కు, రాష్ట్ర బీజేపీ నేతలకు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనకపోతే కేంద్రం చేత కొనిపిచ్చే బాధ్యత తాను తీసుకొంటానని బండి సంజయ్ చెప్పిన వీడియో క్లిప్ను ఈ సందర్భంగా ప్రదర్శించారు. తీరా యాసంగి వడ్లను తాము కొనమని కేంద్రం చేతులెత్తేస్తే, బీజేపీ నేతలు కేంద్రానికి వంతపాడుతున్నారని మండిపడ్డారు.
కేంద్రానిది ద్వంద్వ విధానమని, కేంద్ర మంత్రి గోయల్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ఎంత ద్వేషం ఉన్నదో గోయల్ కక్కిన విషంతో మరోసారి స్పష్టం అవుతున్నదని పేర్కొన్నారు. పంజాబ్లో వడ్లను కొనుగోలు చేసినట్టే, తెలంగాణ వడ్లను కొనాలని డిమాండ్ చేశారు. ఉత్తరాదికి ఒక నీతి.. దక్షిణాదికి ఒక నీతా?, పంజాబ్కు ఒక నీతి.. తెలంగాణకు ఒక నీతా అని నిలదీశారు. తెలంగాణ దేశంలో భాగం కాదా? అని నిప్పులు చెరిగారు. కేంద్రం సాగు చట్టాలు తెచ్చి 750 మంది రైతుల ఉసురు తీసిందని ధ్వజమెత్తారు. ‘రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకం’ అన్న గోయల్ వ్యాఖ్యలు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ అనుకూల విధానాలు దేశానికి మార్గదర్శకంగా ఉన్నాయని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాల వల్ల ఆకలి చావుల తెలంగాణ నుంచి దేశానికే అన్నపూర్ణగా రాష్ట్రం ఎదిగిందని గుర్తుచేశారు. కేంద్ర మంత్రులకు, రాష్ట్ర బీజేపీ నేతలకు చీమూ, నెత్తురు ఉంటే వీటిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
గోయల్ కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి రెచ్చగొట్టేలా మాట్లాడారని పల్లా మండిపడ్డారు. తక్షణమే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకొని, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. రాష్ర్టాల ఉన్నతాధికారులతో గోయల్ సమావేశం ఏర్పాటు చేస్తాననడం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. ఇప్పటికే తెలంగాణ ఉన్నతాధికారులు రాష్ట్ర వైఖరిని కేంద్రానికి చెప్పారని గుర్తుచేశారు. పచ్చి అబద్ధాలు మాట్లాడటం కేంద్రం వైఖరిగా మారిందని, ఇటీవల గిరిజన రిజర్వేషన్ బిల్లు తమ వద్దకే రాలేదని పేర్కొనడమే ఇందుకు నిదర్శమని గుర్తుచేశారు. రాష్ట్ర బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే గల్లీలోకాకుండా ఢిల్లీలో రాష్ట్ర రైతాంగం కోసం పోరాటం చేయాలని హితవుపలికారు. సమావేశంలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎల్ రమణ, యెగ్గే మల్లేశం పాల్గొన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ రూపురేఖలను మార్చిన ఘనత సీఎం కేసీఆర్ది అని మంత్రి ఎర్రబెల్లి గుర్తుచేశారు. కేసీఆర్ చర్యల వల్లే ఇంజినీర్లు, సాఫ్ట్వేర్ నిపుణులు సైతం వ్యవసాయం వైపు మళ్లారని చెప్పారు. రైతుల మేలు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నట్టు దేశంలో మరే రాష్ట్రమైనా చేస్తున్నదా అని ప్రశ్నించారు. రైతులకు తామేమి చేశామో.. కేంద్రం ఏమి చేసిందో తేల్చుకొందామని, ఈ విషయంలో గోయల్ బహిరంగ చర్చకు రావాలని ఎర్రబెల్లి సవాల్ విసిరారు. నూకలు తెలంగాణ ప్రజలు తింటారో.. ఇంకెవరు తింటారో తేల్చుకొందామని పేర్కొన్నారు. గోయల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వడ్లను కొనాల్సిందేనని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా రైతాంగం సాగు చట్టాలపై ఉద్యమించి, వాటిని రద్దు చేసేదాకా ఎలా ఉద్యమించారో, అదే స్ఫూర్తితో కేంద్రం వడ్లు కొనేదాకా ఉద్యమం చేస్తామని తేల్చిచెప్పారు. బీజేపీ నేతలను గ్రామాల్లో తిరగనీయబోమని హెచ్చరించారు. కేంద్రంతో ధాన్యం కొనిపించలేని దద్దమ్మలకు సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కులేదని ధ్వజమెత్తారు.
యాసంగిలో ధాన్యం కొనుగోలుపై కేంద్రప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను అవమానాలకు గురి చేస్తున్నది. పంజాబ్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టుగానే తెలంగాణ నుంచి కూడా ధాన్యం కొనాలి. మంత్రులంతా కలిసి ధాన్యం కొనుగలు చేయాలని కోరితే కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వెటకారంగా స్పందించడం సిగ్గుచేటు. ఆయన వ్యాఖ్యలను తెలంగాణ సమాజమంతా గమనిస్తున్నది. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నది. యాసంగి ధాన్యం కొనుగోలు చేయకపోతే మరో పోరాటం తప్పదు. ఏమాత్రం వెనక్కు తగ్గం.
-మంత్రి పువ్వాడ అజయ్కుమార్
పీయూష్ గోయల్.. ముందు తెలంగాణలోని మీ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలకు నూకలు తినిపించు. కేంద్రంలోని పెద్దలు ఒకటి చెప్తరు. రాష్ట్ర బీజేపీ నాయకులు మరొకటి మాట్లాడుతరు. దేశంలో ఒకే బీజేపీ ఉన్నదా? పది బీజేపీలా? వాళ్లకు మెదడు పనిచేస్తుందా? అధికారంలోకి వచ్చాక చట్టాలు మార్చుకోండని పీయూష్ అనొచ్చా? కేంద్ర పీఠం ఎప్పటికీ మీకు రాసి పెట్టి ఉంటదా? ఆ అవకాశమే వస్తే చేసి, చూపించే సత్తా టీఆర్ఎస్కు ఉన్నది. రాష్ట్రం వచ్చిన ఎనిమిదేండ్లలోనే ఎలాంటి అద్భుతాలు జరిగాయో కండ్ల ముందు కనిపిస్తున్నది. మరి మీరేం(బీజేపీ) చేశారో సమాధానం చెప్పాలి. మీ దిక్కులేని ముఖాలకు దేశంలో ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారా? రాష్ట్రంలో ఫలానా పని చేశామని చెప్పుకొనేందుకైనా ఓ ప్రాజెక్టు తెస్తామనే ఇంగితజ్ఞానం రాష్ట్ర బీజేపీ ఎంపీలకు లేదా? కిషన్రెడ్డి ఎంపీగా ఎన్నికై మూడేైండ్లెనా సికింద్రాబాద్ అభివృద్ధికి, తెలంగాణ రాష్ర్టానికి పైసా తీసుకురాలేదు.
– మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
తెలంగాణ ప్రజలకు నూకలు తినటం నేర్పించాలంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చూపడమే కాకుండా, రాష్ట్ర మంత్రులతో వ్యవహరించిన తీరు సరికాదు. ధాన్యం కొనుగోళ్లలో బాధ్యతగా మాట్లాడాల్సిన గోయల్.. రాష్ర్టాన్ని అవమానించటం సిగ్గుచేటు.
– బండ శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్
పీయూష్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలకు అవమానం కాదు.. మాట్లాడినవాళ్ల సంస్కారానికి నిదర్శనం. ఉన్నత పదవుల్లో ఉండి, దేశానికి నాయకత్వం వహించే స్థానంలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడమంటే.. వారికి ఆ అర్హత లేదని అర్థం. వెంటనే జాతీయ నాయకత్వం నుంచి వైదొలగాలి.
– మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం ప్రాజెక్టు ఓఎస్డీ
రాజకీయంగా నూకలు చెల్లినవాడే నూకలు తినుమని అంటడు. కేంద్రమంత్రిది బాధ్యతారహితమైన అడ్డగోలుమాట. తెగిస్తేనే తెలంగాణ సాధ్యమని పోరాడి స్వరాష్ర్టాన్ని తెచ్చుకున్నోళ్లం, వెనకడుగు వేయని వాళ్లం, ఇన్నీ తెలిసి తెలంగాణను వెక్కిరిస్తే ఒప్పుకోదు, తిరుగబడుద్ది. మనవి చేయటానికి వచ్చినోళ్లని పట్టుకొని మాటామంచీ లేకుండా మాట్లాడటం అంటే యుద్ధానికి తట్టి లేపినట్టే. న్యాయబద్ధంగా మీ పని మీరు చేయండి అని అడిగితే ఎక్కిరిస్తారా? గుజరాత్ను మించిపోతున్నామనా మీ ఏడుపు? తెలంగాణ మట్టిని తొలుచుకొచ్చిన ఆ మూడక్షరాల శక్తి స్వరూపం ప్రత్యామ్నాయంగా ఎదిగొస్తారన్న భయమా? మేం దేశం ఆకలి తీర్చే అన్నం గిన్నయినోళ్లం. దేశానికి వరిబువ్వ వండిపెడ్తున్నం. ‘షురు హువాహై జంగ్’. యుద్ధం మొదలైంది చూడు. బెంగాల్లో ఆట మొదలయ్యింది, తెలంగాణ నుంచి యుద్ధం మొదలైతది.
– జూలూరు గౌరీశంకర్, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్
నాకు వందేండ్లు ఉంటయ్ బిడ్డా. నా చిన్నతనాన తిందామంటే ఏమీ దొరికేది కాదు. ఒకపూట గటుక తిని రోజంతా ఉండేది. గటుక లేని రోజు మక్కజొన్న రొట్టెలు తిని బతికినం. నాకు 31 ఏండ్లు వచ్చినంక నూకల అన్నం తిన్న. ఆ రోజుల్లో నూకలు దొరికితే మహా సంబుర పడేది. 60 ఏండ్లు దాటిన తర్వాతనే బియ్యం అన్న తింటున్న. మాకు 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. వెనుకట కాలంకాక పంటలు ఎండిపోతే తినడానికి ఏమీ దొరకక తిప్పలు ప్డడం. తెలంగాణ వచ్చిన తరువాత రెండు పంటలకు సరిపడ నీళ్లు వస్తున్నయి. వడ్లు కూడ బాగా పండుతున్నయి. నూకలు తినండి అని కేంద్ర మంత్రి అనుడు పద్ధ్దతి కాదు. తెలంగాణ ప్రజల బతుకులను ఎగతాళి చేయడం సరికాదు.
-భైరి వీరయ్య, రైతు, వావిలాల, మహబూబాబాద్
నేను ఏటా తొమ్మిది ఎకరాల్లో సాగు చేస్తాను. మాకు పుష్కలంగా సాగునీటి వనరులు అందుబాటులో ఉన్నాయి. ఏటా నాలుగెకరాల్లో వరి పండిస్తా. కానీ, ఈసారి వడ్లు కొనబోమని కేంద్రం చెప్పడంతో ఆ నాలుగు ఎకరాలూ బీడుగానే ఉంచా. రైతుల నోట్లో మట్టి కొట్టేలా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయి. యాసంగి వడ్లను బాయిల్డ్ చేస్తేనే మంచి బియ్యం వస్తాయి. సరాసరి పట్టిస్తే నూకలే అవుతాయి. ఈ విషయం తెలవని కేంద్ర మంత్రి గోయల్.. నూకలు తినాలని చెప్పడం కచ్చితంగా ఇక్కడి ప్రజలను అవమానించడమే. బీజేపీని ప్రజలు పాతరేసే రోజు త్వరలో వస్తుంది.
-వెంకటపుల్లయ్య, రైతు, కాచిరాజుగూడెం, ఖమ్మం జిల్లా
మా చిన్నతనంలో జొన్నన్నం, సజ్జన్నం, కొర్రలు, రాగులు, తైదలు తినేవాళ్లం. పండుగ పూట నూకలన్నం పరమాన్నంలా వండుకొనేవాళ్లం. తెలంగాణ ఏర్పడిన తరువాత సన్న బియ్యం పండించుకొని తింటున్నాం. కేంద్ర మంత్రి వడ్లు కొనలేక తెలంగాణ ప్రజలను అవమానించడం సిగ్గుచేటు. వడ్లు కొనలేక రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నడు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి నూకల్లు చెల్లినట్టే.
-చదుర్ల అనసూర్యమ్మ, అవంతీపురం, నల్లగొండ జిల్లా