బూత్ స్థాయి వరకు టార్గెట్లు.. తలలు పట్టుకొంటున్న నేతలు
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రతో పార్టీ నేతలకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఈ నెల 14న యాత్ర ముగింపు కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్షా రానున్నారు. దీంతో భారీఎత్తున జన సమీకరణ చేయాలని బండి సంజయ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 5న పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో నిర్వహించిన సభకు ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవటం, మరుసటి రోజే వరంగల్లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సభకు ఎక్కువ మంది రావటంతో బీజేపీ అధిష్ఠానం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.
వాస్తవానికి ప్రజాసంగ్రామ యాత్ర ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకే పరిమితం. ఈ పాదయాత్రకు జిల్లా ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. దీంతో అమిత్ షా సభ కోసం నాయకులందరికీ బండి టార్గెట్లు పెట్టారు. రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ బూత్ నుంచి కనీసం 10–20 మంది, మండలాల నుంచి వెయ్యి నుంచి ఐదు వేల వరకు, హైదరాబాద్ సమీప జిల్లాలు, మండలాల నుంచి 5–10 వేల చొప్పున జన సమీకరణ చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఇక్కడే మరో కొత్త తలనొప్పి వచ్చి పడింది. కొన్ని చోట్ల నియోజకవర్గ స్థాయి నేతలకే దిక్కు లేదు. అలాంటిచోట బూత్ అధ్యక్షులు ఎలా ఉంటారని, వారు 20 మందిని ఎలా తీసుకొస్తారని పార్టీలో చర్చించుకొంటున్నారు.