బాల్కొండ/భీమ్గల్,/వేల్పూర్, నవంబర్ 29: అభివృద్ధికి నయా పైసా నిధులు తీసుకురావడం చేతకానీ బీజేపీ నాయకులు కులం, మతం, దేవుడి పేరుతో అబద్ధాలు మాట్లాడుతున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి మంగళవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. జలాల్పూర్ నుంచి నాగపూర్ ఎక్స్ రోడ్డు వరకు రూ.60 లక్షలతో బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు, నూతనంగా మంజూరైన ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
భీమ్గల్-గోన్గొప్పుల రహదారి బోగరపు వాగుపై రూ.2.60 కోట్లతో నూతనంగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జ్ ప్రారంభించారు. భీమ్గల్-బెజోరా రహదారి జక్కలత్ ఒర్రెపై రూ.2.35 కోట్లతో నూతనంగా నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. భీమ్గల్, కమ్మర్పల్లి రహదారిపై మెండోరా వద్ద రూ.1.66 కోట్లతో నూతనంగా నిర్మించిన వంతెన ప్రారంభించారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి మొనగాడివని నిరూపించుకోవాలని ఎంపీ అర్వింద్కు సవాల్ విసిరారు. పచ్చగా ఉన్న పల్లెల్లో, కులం, మతాల పేర్లతో చిచ్చు పెట్టి ఆగం చేస్తున్న నాయకులెవరో, నిరంతరం అభివృద్ధికి పాటుపడుతున్న వారెవరో ఆలోచన చేయాలని మంత్రి కోరారు. కాగా, వేల్పూర్ మండల కేంద్రంలో దీక్షా దివస్ నేపథ్యంలో మంగళవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి వేముల క్షీరాభిషేకం చేశారు. కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన దీక్ష మలిదశ తెలంగాణ ఉద్యమంలో మహోన్నత ఘట్టం అన్నారు.