మునుగోడు: బీజేపీ నేతలు చెప్పేవన్నీ అబద్దపు మాటలని మంత్రి హరీశ్రావు కొట్టిపారేశారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెస్తామంటున్న బీజేపీ నేతల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఇవాళ మునుగోడులో మీడియా సమావేశంలో మాట్లాడిన హరీశ్రావు.. తెలంగాణలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని దేశంలోనే అత్యున్నత ప్రభుత్వ విభాగమైన నీతీ ఆయోగ్ అప్పట్లో చెప్పిందని, అయినా కేంద్రం మాత్రం 24 పైసలు కూడా ఇవ్వలేదని మంత్రి గుర్తుచేశారు. అలాంటి కేంద్రం నుంచి బీజేపీ నేతలు నిధులు తెస్తామంటే జూటా మాటలు కావా..? అని ఆయన ప్రశ్నించారు.
అదేవిధంగా సత్వర సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం అంటూ బీజేపీ ఇస్తున్న హామీపై కూడా మంత్రి హరీష్రావు విమర్శలు గుప్పించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఎంతో తేల్చమని ఎనిమిదేండ్లుగా అడుగుతున్నా కేంద్రం తేల్చలేకపోయిందని, దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో ఎంతో మందిని కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం దక్కలేదని ఆయన చెప్పారు. ఎనిమిదేండ్ల నుంచి కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటా తేల్చలేని బీజేపీ పెద్దలు.. సత్వర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఎలా పూర్తిచేస్తరని ఎద్దేవా చేశారు.