హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ)/మాదాపూర్: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టించి ఎన్నారై కుటుంబాన్ని మోసం చేసిన కేసులో కూకట్పల్లికి చెందిన బీజేపీ నాయకుడిని సీసీఎస్ పోలీసులు విచారించారు. యూసుఫ్గూడకు చెందిన ఆర్ రమేశ్కుమార్, ఎన్నారై అయిన అతడి సోదరుడు విజయ్కుమార్ను 2022 అక్టోబర్లో వడ్డెపల్లి లలిత్ శరణ్కుమార్ అలియాస్ వీఎల్ శరణ్కుమార్, మరికొందరు కలిశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రూ.10 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని, తమ కంపెనీ భారీ లాభాలు ఇస్తుందంటూ నమ్మబలికారు. విదేశాల్లో ఐటీ కంపెనీల ప్రతినిధి అయిన బాధితుడు, అతడి సోదరుడు వీరి మాటలు నమ్మారు.
మొదటి దఫాగా రూ.5 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. ఈ సొమ్మును నిందితుడు శరణ్కుమార్, అతడి వ్యాపార భాగస్వాములు సొంతానికి వాడుకొన్నారు. ఎన్నారై సోదరులకు రూ.6.1 కోట్ల వరకు నష్టం చేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు.. నిందితుడు శరణ్కుమార్ను అదుపులోకి తీసుకొని విచారించారు. శరణ్కుమార్ బీజేపీ నాయకుడని పోలీసులు తెలిపారు. విచారణ కోసం నిందితుడిని సీసీఎస్ పోలీసులు పిలిపించగా, అదృశ్యమయ్యాడంటూ అతడి కుటుంబ సభ్యులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడ మిస్సింగ్ కేసు నమోదైంది.