అగ్ర కథానాయకుడు ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్’ ‘ఫౌజీ’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఇటలీ విహారయాత్ర నుంచి తిరిగొచ్చిన ఆయన హైదరాబాద్లో జరుగుతున్న ‘ఫౌజీ’ షూటింగ్లో జాయిన్ అయ్యారు. డిసెంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరితగతిన ఈ సినిమా షూట్ను పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నారట. అందుకోసం ఆగస్ట్ నెల మొత్తాన్ని ఈ సినిమాకే కేటాయించారని తెలిసింది. తాజా షెడ్యూల్ నాన్స్టాప్గా జరుగుతుందని, ప్రభాస్పై కొన్ని యాక్షన్ ఘట్టాలతో పాటు కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారని తెలిసింది.
1940 దశకం నాటి స్వాతంత్య్ర సంగ్రామం, రెండో ప్రపంచయుద్ధం తాలూకు ఘటనల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ హైప్ని క్రియేట్ చేశాయి. ఇమాన్వి, మిథున్చక్రవర్తి, అనుపమ్ఖేర్, జయప్రద, భానుచందర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్చంద్రశేఖర్, నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, భూషణ్ కుమార్, రచన-దర్శకత్వం: హను రాఘవపూడి.