Bandi Sanjay | హుజూరాబాద్ టౌన్ : కాంగ్రెస్ పార్టీ దోఖాబాజ్ పార్టీ అని ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక గ్యారెంటీలకు కోతలు పెడుతూ ప్రజలను మోసగిస్తున్నదని మండిపడ్డారు. మరో పది రోజుల్లో ఎలక్షన్కోడ్ వస్తుందని, అప్పుడు మళ్లీ ఓటేస్తే ఆరు గ్యారంటీలు ఇస్తామని డ్రామాలు చేస్తారని విమర్శించారు. అసలు ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు. రెండో విడత ప్రజాహిత యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, సైదాపూర్ మండలాల్లో పర్యటించిన బండి సంజయ్.. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నదని బండి సంజయ్ విమర్శించారు. ఆరు గ్యారంటీలతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే రూ.5 లక్షల కోట్లు అవసరమని అన్నారు. ఒక్క మహాలక్ష్మీ పథకం అమలు చేయడానికే రూ.50 వేల కోట్లకుపైగా కావాలని అన్నారు. ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ వెంటనే రేషన్కార్డుల ఇవ్వాలన్నారు. లక్షలాది కుటుంబాలు ఇండ్ల కోసం అల్లాడుతుంటే నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తీరును చూస్తుంటే వెయ్యి మందిని పెండ్లికి పిలిచి అందులో 10 మందికి మాత్రమే అరిటాకులో అన్నం పెట్టినట్లుగా ఉందని విమర్శించారు. హామీలు అమలు చేయకపోతే ఆ పార్టీని బొంద పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
దేశమంతా మోదీ గాలి వీస్తోందని బండి సంజయ్ అన్నారు. బీజేపీ పార్టీకి మోదీ ప్రధాని అభ్యర్థిగా ఉన్నారని, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరున్నారని ప్రశ్నించారు. కొట్లాడింది బీజేపీ అయితే అధికారం మాత్రం కాంగ్రెస్కు ఇచ్చారని, మళ్లీ అలా చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ ఎంపీగా మరోసారి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. తన జీవితాంతం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. మళ్లీ ఎంపీగా గెలిపిస్తే ప్రధానిని ఒప్పించి అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో కరీంనగర్ను ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.