నల్లగొండ, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణప్రతినిధి): కేంద్రంలోని బీజేపీ సర్కార్ దొడ్డిదారిన మరోసారి అధికారంలోకి రావాలన్న దురుద్దేశంతోనే జమిలి జిమ్మిక్కులకు తెరలేపుతున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ గ్రాఫ్ పడిపోతుందన్న భయంతో జమిలి సాధ్యం కాకపోతే మినీ జమిలికి కూడా కేంద్రం సన్నాహాలు చేస్తున్నదని అన్నారు. బుధవారం నల్లగొండలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. జనవరి 16వ తేదీలోపు తెలంగాణతోపాటు మరో నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల పేరుతో కేంద్రం జాప్యం చేస్తున్నదని మండిపడ్డారు. దేశ ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి నుంచి దారి మళ్లించేందుకు చేస్తున్న కుతంత్రాలే ఇవన్నీ అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణతోపాటు దేశ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ లాంటి సమర్థ పాలకులను తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలని, సుస్థిర ప్రభుత్వానికి ప్రజలు జై కొట్టాలని పిలుపునిచ్చారు. తొమ్మిదిన్నర ఏండ్లుగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా, సురక్షితంగా ముందుకు సాగుతుందని చెప్పారు. కేసీఆర్ సర్కారుపై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. అసలు వారి పార్టీలోనే తెలంగాణ ద్రోహులు ఉన్నారని విమర్శించారు. అలాంటి ద్రోహులకు తాజాగా వైఎస్ షర్మిల లాంటి సమైక్యవాద నేతలు తోడవుతున్నారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ సమర్థతతోనే హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదని గుత్తా సుఖేందర్రెడ్డి దుయ్యబట్టారు.