మహబూబాబాద్ : కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ..ఏడాదిగా ఆందోళనలు చేస్తున్న రైతులను కార్లతో తొక్కించి చంపుతున్న పార్టీ బీజేపీ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు.
కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూనే.. రైతాంగాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. సోమవారం నూతనంగా నియామకమైన తొర్రూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పి.శాంతసీతారాములు, కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసి, కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాలను తీసుకొచ్చిందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రపంచం మెచ్చే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించి తెలంగాణాలో పుష్కలంగా సాగునీరు అందిస్తున్నారు.
భూగర్భ జలాలు పెంపొందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రైతులకు నష్టాలు తెచ్చే చట్టాలను ఒప్పుకునేది లేదన్నారు. ప్రతి గ్రామంలో రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు, పార్టీ కార్యకర్తలకు సూచించారు.