తాంబూలాలిచ్చేశాం.. పెండ్లి ఎప్పుడని మాత్రం అడగొద్దు అన్న చందంగా మహిళా బిల్లును చకాచకా దాటించి బీజేపీ సంబురపడుతున్నది. సుమారు పదేండ్ల కాలయాపన.. దాదాపు ముగిసిన రెండో విడత పదవీకాలం.. దేశమంతటా ముప్పిరిగొన్న ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో మోదీ సర్కారు మహిళా బిల్లును బయటికి తీసింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు వేసిన ఎత్తుగడగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఇది బీజేపీకి వరమో శాపమో తెలియని పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఓబీసీ తేనెతుట్టె కదిలింది. మహిళలకు చట్టసభల్లో కోటా సరే.. అందులో మా ఓబీసీలకు కోటా ఏది? అనే ప్రశ్న బీజేపీ మెడపై కత్తిలా వేలాడుతోంది. కోటాలో కోటాలు వద్దని 2008లో జయంతి నటరాజన్ కమిటీకి విస్పష్టంగా, లిఖితపూర్వకంగా బీజేపీ తెలియజేసింది. కాబట్టి మాటమార్చే అవకాశం లేదు. మందిర్ రాజకీయాలతో ఎదిగిన బీజేపీ మండల్కు బద్ధవ్యతిరేకమని అనేక మార్లు రుజువైంది. సమస్య మహిళా రిజర్వేషన్ చట్టానికే పరిమితమైంది కాదు. ఓబీసీ సమస్య బీజేపీకి గుదిబండగా మారే అవకాశముంది.
దేశ జనాభాలో 52 శాతానికి పైగా ఉన్న ఓబీసీలు అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనల్లో తమ వాటా తమకు దక్కాలని కోరుకుంటున్నారు. గత పదేండ్ల పాలనలో తీవ్ర వివక్షకు గురైనామని, ఇంకా నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఏ కులంవారు ఎంత మంది ఉన్నారో లెక్క తేల్చకుండానే వర్గీకరణ అమలుచేయడం ఎలా కుదురుతుందని ఓబీసీ నేతలు కేంద్రాన్ని నిలదీస్తున్నారు. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనాభా దామాషాను బట్టి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని, పెరిగిన జనాభాను బట్టి ప్రస్తుత రిజర్వేషన్లను పెంచాలని కేంద్రానికి అనేక విజ్ఞప్తులు చేశారు. కానీ వీటిపై కేంద్రం స్పందించకపోవడం గమనార్హం.
ఓబీసీ వాటా కోసం బీజేపీలోనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నేత ఉమాభారతి మహిళా కోటాలో ఓబీసీ కోటా లేకపోవడాన్ని ప్రశ్నించారు. 2010లో తాము తయారుచేసిన మహిళా బిల్లు ముసాయిదాలో ఓబీసీల డిమాండ్ చేర్చకపోవడం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెగబాధపడిపోతున్నారు. ఎన్నికల వేళలో రాజకీయ నేతలకు ఓబీసీలు గుర్తుకు వస్తారనడానికి ఇవి ప్రబల ఉదాహరణలు. ఎన్నికలతో ప్రమేయం లేకుండా బీసీల ప్రయోజనాలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఏదో ఎన్నికల సమయం వచ్చింది కదా అని హడావుడి చేయకుండా పరిపాలనా పగ్గాలు చేపట్టిన మొదటిరోజు నుంచే బీసీల సమ్మిళిత అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాచరణ రూపొందించుకొని అమలు చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా కేవలం ఎన్నికల దృష్టితో కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న విధానాలు విమర్శలకు గురవుతున్నాయి. తమ డిమాండ్ల సాధనకు కేంద్రంపై పోరుబాట పట్టేందుకు బీసీలు సమాయత్తమవుతున్నారు.