సిగ్గుపడాలె.. నరేంద్రమోదీ! ఈ దేశం ఎవనయ్య సొత్తు కాదు. నాశనం చేస్తుంటే చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోం
– సీఎం కేసీఆర్
ఏంది చూసేది తోక మట్ట!
ఎవరికి లాభం జరిగింది దేశంలో? ఎవరు బాగు పడ్డరు? గ్రామీణులు, సామాన్య ప్రజలు, పేదలకు ఎవ్వరికీ ఏకాణా పని జరగలే. ఇది వాస్తవం. ఇది మాట్లాడితే.. ఏయ్ కేసీఆర్ నీ సంగతి చూస్తం అంటరు. ఏం సంగతి తోకమట్టనా? ఏంది చూసేది సంగతి? చూసేది కేసీఆర్ సంగతేనా? కేసీఆర్ భయపడతడా? భయపడితే తెలంగాణ వచ్చునా?
నేను నీటి చుక్కనే.. మరి మీరెందుకు గడగడ వణుకుతున్నరు..
కేసీఆర్ ఎంతనయ్యా.. సముద్రంలో నీటిచుక్కంత అంటడు. నిజమే నీటిచుక్కనే అనుకొందాం.. నీటి చుక్కకే గంతగనం ఎందుకు గడగడ వణుకుతున్నరు. కేసీఆర్ మాట్లాడితే గట్టిగా మాట్లాడుతడు. నాకు ఏం లాలూచీ లేదు కదా, లంగ ఆస్తులు లేవు, దొంగ సంపాదన లేదు కదా అందుకే గట్టిగా మాట్లాడుతున్న – సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 12 : కాంగ్రెస్ నేత రాహుల్గాంధీని అవమానించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను వెంటనే బీజేపీ నుంచి బహిష్కరించాలని, సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్చేశారు. ఆయన అన్న మాటలు తలచుకొంటేనే కండ్లల్లో నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వేదాలు, పురాణాల నుంచి ఇదే నేర్చుకొన్నామా? అని బీజేపీ నేతలను నిలదీశారు. ధర్మాన్ని కాపాడటానికి, న్యాయం పక్షాన నిలబడటానికి తెలంగాణ ఎప్పుడూ పులిలా తయారుగా ఉంటుందని స్పష్టంచేశారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ‘రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ ఎంపీ ఉన్నడు. నాకు ఆయనతోని సంబంధం లేదు. కానీ.. వాళ్ల తాత స్వతంత్ర పోరాటంచేసి, అనేక సంవత్సరాలు మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. వాళ్ల నాయనమ్మ, నాయన దేశం కోసం పనిచేసుకుంట చనిపోయిన్రు. ఇప్పుడు రాహుల్గాంధీ కూడా ఎంపీగా ఉన్నడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు అనేక విషయాలు మాట్లాడుతం. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ప్రజాప్రతినిధులు అనేక ప్రశ్నలు అడుగుతరు. అట్లనే రాహుల్గాంధీ కూడా ఒక ఎంపీగా ఏదో అడిగిండు. దానికి అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి ‘రాహుల్ గాంధీ.. ఏ అయ్యకు పుట్టినవని మేము నిన్ను అడిగినమా’ అని అన్నడు. ఒక ముఖ్యమంత్రి ఈ మాట అనొచ్చునా? ప్రధాని మోదీ.. ఇది మీ బీజేపీ సంస్కారమా? ఇది మన హిందూ ధర్మమా? ఇది మన దేశానికి మర్యాదనా? ఒక పెద్ద పార్టీ నేతను పట్టుకొని మీ ముఖ్యమంత్రి ఇలాంటి మాటలు అంటరా? ఆ మాటలు తలచుకొంటేనే నా బుర్ర బద్ధలైతున్నది. కండ్లల్ల నీళ్లు వస్తున్నయి. మీరు ఎదుటి పక్షం నేతలపై పోరాడొచ్చు.. తప్పు కాదు. కానీ ఒక ఎంపీని పట్టుకొని మీ పార్టీకి చెందిన సీఎం ఇలాంటి మాటలు మాట్లాడొచ్చునా? మనం వేదాలు, భగవద్గీత, రామాయణం, మహాభారతం నుంచి ఇదే నేర్చుకొన్నమా? హిందూధర్మం పేరుతో ఓట్లు అడుగుతూ, మీ నేతలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నరు. కన్నీళ్లతో బీజేపీ జాతీయ అధ్యక్షుడిని అడుగుతున్నా.. నడ్డాజీ మీరు వెంటనే అస్సాం ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయండి. భారతీయుల తరఫున నేను ఈ డిమాండ్చేస్తున్నా.
అహంకారమా? కండ్లు నెత్తికి వచ్చినయా?
ఓపికకు కూడా ఒక హద్దు ఉంటది. ఏది పడితే అది మాట్లాడుడేనా? అహంకారమా? కండ్లు నెత్తికి వచ్చినయా? ఏం తమాషా చేస్తున్నరా? ఈ దేశం ఇట్లా నాశనం అయిపోతుంటే ప్రజలందరూ ఊరుకుంటరా? చేతులు ముడుసుకొని కూర్చుంటమా? ధర్మాన్ని, నిజాన్ని కాపాడటానికి, న్యాయం పక్షాన నిలబడటానికి, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడూ పులిలా తయారుగా ఉంటది. ఎవరికి అన్యాయం జరిగినా సహించదు. అది తెలంగాణ గడ్డలో.. తెలంగాణ రక్తంలో ఉన్న పౌరుషం’ అని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.
నీటి చుక్కకే గడగడ వణుకుతున్నరు!
నేను నిన్న జనగామలో మాట్లాడితే బీజేపోళ్లకు లాగులు తడిసి ఒకడు మాట్లాడుతున్నడు. కేసీఆర్ ఎంతనయ్యా అంటడు. కేసీఆర్ను బక్క పేదోడు పిసికి పారేస్తం అంటడు. తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఇట్లనే అన్నరు కదా, ఒకడు మాట్లాడిండు.. కేసీఆర్ ఎంతనయ్యా.. సముద్రంలో నీటిచుక్కంత అంటడు. నిజమే నీటిచుక్కనే అనుకొందాం.. నీటి చుక్కకే గంతగనం ఎందుకు గడగడ వణుకుతున్నరు. ఎందుకు భయపడుతున్నవు. ఏం భయం అయితాంది నీకు. కేసీఆర్ మాట్లాడితే గట్టిగా మాట్లాడుతడు. నాకు ఏం లాలూచీ లేదు కదా, లంగ ఆస్తులు లేవు, దొంగ సంపాదన లేదు కదా అందుకే గట్టిగా మాట్లాడుతున్న.
దేశాన్ని ఆకలిరాజ్యం చేస్తరా?
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఉంటది. ఇది నేను తయారుచేయలె. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం చేస్తరు. 115 దేశాల్లో సర్వే చేస్తే మన దేశం 101వ స్థానంలో ఉన్నది. మనకంటే బంగ్లాదేశ్, నేపాల్ పైకి ఉన్నాయి. మనకంటే పాకిస్థాన్ పైకి ఉన్నది. మరి నరేంద్రమోదీ ఏం చేస్తున్నట్టు. బీజేపీ జెండా ఏం చేస్తున్నట్టు. యాడ పన్నట్టు. భారతదేశాన్ని ఆకలి రాజ్యం చేస్తరా? దీనికి సమాధానం చెప్పు. వట్టి లొల్లి పెట్టుడు కాదు కదా. లొడలొడ ఒర్రుడు కాదు కదా. దేశంలో అనుకోని, వినుకోని కరోనా వచ్చింది. పవిత్రమైన గంగానదిలో శవాలు తేలుతయా? ఈ దిక్కుమాలిన పరిపాలనకు ఏం సమాధానం చెప్తరు? దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కోటానుకోట్ల మంది ఎదుర్కొన్న అతి పెద్ద బాధ ఇది. తెలివి తక్కువ నిర్ణయంతో లాక్డౌన్ పెట్టిన్రు. లాక్డౌన్ వల్ల కోట్ల మంది వందలు, వేల కిలోమీటర్లు రోడ్లమీద నడిచిన్రు. తెలివి తక్కువ ప్రధానమంత్రి ఏం అంటడంటే.. వేరే ప్రభుత్వాలు రైళ్లలో వారిని పంపితేనే కరోనా పెరిగిందని చెప్తడు. ఇది ధర్మమా, న్యాయమా?
నా ప్రాణం.. తెలంగాణ
నా రాష్ట్రం నాకు ముఖ్యం. నా ప్రాణం.. తెలంగాణ. ఇక్కడ నీళ్లు రావాలి. కరెంటు రావాలె. నా తెలంగాణ ప్రజలు బాగు పడాలె. వీటిని నా కండ్లారా చూసి సంతోషపడాలి. అదే నా లక్ష్యం. కెలికి కట్టె పెట్టి, మీటరు పెట్టు, మోటరు పెట్టు, నీ రైతులను నువ్వే బొంద పెట్టు అంటున్నరు. నేను సచ్చినా సరే.. ఎందాక కొట్లాడైనా సరే, నీ కరెంటు పాలసీని తెలంగాణలో అమలు చెయ్యను. తెలంగాణ బాయిలకు మీటర్లు పెట్టం. నీ రైతు వ్యతిరేక చర్యలను తెలంగాణ ఒప్పుకోదు.