జనగామ, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): పేదలు దాచుకొన్న సొమ్మును అదానీ, అంబానీలకు కట్టబెడుతూ దేశాన్ని నిట్టనిలువునా దోచుకుంటున్న స్ట్టూవర్ట్పురం దొంగల ముఠాగా బీజేపీ తయారైందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండ శివారులోని దేవాదుల మల్లన్నగండి రిజర్వాయర్ కుడి కాల్వ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. వివిధ గ్రామాలకు సాగునీరందించేందుకు రూ.29 కోట్లతో జరుగుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకొని సూచనలు చేశారు. అనంతరం జిల్లా గంథ్రాలయ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు.
ఎల్ఐసీలో నిరుపేదలు దాచుకున్న సొమ్మును కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్పొరేట్ల పాలు చేసి వారి ఆస్తులు పెంచిందని ఆరోపించారు. అలాంటి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్, కిషన్రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీ దండుపాళ్యం అంటూ విమర్శించడం సిగ్గుచేటన్నారు. రైతుల రుణమాఫీకి మనసు రాదు కానీ.. రూ.12 లక్షల కోట్ల రుణం తీసుకొని చేతులెత్తేసిన కార్పొరేట్ సంస్థల బకాయిలను మాత్రం మాఫీ చేస్తుందని ధ్వజమెత్తారు. ఎవడబ్బ సొమ్మని రుణాలను మాఫీ చేస్తారని కడియం ప్రశ్నించారు. బండి సంజయ్, కిషన్రెడ్డి సహా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పసలేని, నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని హితవుపలికారు.
రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదా?
తెలంగాణను కేసీఆర్ అప్పుల్లోకి నెడుతున్నారని విమర్శించే వారికి అభివృద్ధి కనిపించడం లేదా? అని కడియం నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కండ్లుండి చూడలేని కబోదులుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చాక్లెట్లు, పుట్నాలు కొనుక్కుని తినడానికి అప్పులు చేయలేదని, కాళేశ్వరం, దేవాదుల, సమ్మక్క బరాజ్, సీతారామ ప్రాజెక్ట్, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులతో సాగునీరు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించడం ద్వారా రైతును రాజును చేసి ఆస్తులు పెంచేందుకే అనివార్యంగా అప్పులు చేస్తున్నారని గుర్తుచేశారు.
ఎనిమిదన్నరేండ్లలో సాగు విస్తీర్ణం పెరుగలేదా? ఉచిత కరెంటు ద్వారా రైతులు అధిక దిగుబడి సాధించడం లేదా? 65 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్ల రైతుబంధు అందించలేదా? కండ్ల ముందు అమలవుతున్న సంక్షేమ పథకాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ ఒక్క చోట కూడా బీజేపీకి డిపాజిట్ దక్కదని జోస్యం చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ఏ మాత్రం దమ్ము, పలుకుబడి ఉన్నా కేంద్రం నుంచి పనులు సాధించి ప్రజల్లోకి రావాలని హితవు పలికారు.