హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ‘67 ఏండ్లుగా ఎన్నో పోరాటాలు చేశాం. ఎక్కని గడప లేదు. మొక్కని పార్టీ లేదు. మా గోస చూసి ప్రధానమంత్రే కన్నీళ్లు పెట్టుకున్నడు. ఇన్నేండ్లలో ఎన్నో పార్టీలను గెలిపించినం. అయినా ఏ ఒక్కరూ మా గోడు పట్టించుకోలె. సీఎం కేసీఆర్ ఒక్కరే మా దశాబ్దాల ఆర్తిని, దాహార్తిని తీర్చిండు. 2003లో ఫ్లోరోసిస్పై పోరు యాత్రలో భాగంగా మా దగ్గరికి వచ్చిండు. తెలంగాణ వస్తే శుద్ధి చేసిన నీళ్లు ఇస్తనన్నడు. అన్నట్టే చేసి చూపించిండు. ఇచ్చిన హామీలను ఆచరణలో పెట్టిన ఏకైక నాయకుడు ఆయనే’ అని ఏపీ, తెలంగాణ జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశర్ల సత్యనారాయణ కొనియాడారు. దప్పిక తీర్చిన పార్టీనే తప్పక గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్తోనే ప్రగతి సాధ్యమని చెప్పారు. మునుగోడు ఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని ధ్వజమెత్తారు. జలసాధన సమితి నేతలు, ఫ్లోరైడ్ బాధితులతో కలిసి హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో దుశర్ల మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో
పలు అంశాలను వివరించారు. కొంతకాలంగా బీజేపీ, ఇతర పార్టీల నేతలు ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారని.. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నల్లగొండలో ఫ్లోరైడ్ మొత్తంగా తొలగిపోయిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా ప్రకటించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. అదీగాక 2013లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండలో ఫ్లోరైడ్ రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం 8 ఎకరాల భూమిని కేటాయించి ఆ ప్రతిపాదనలను కేంద్రానికి పంపిందని గుర్తుచేశారు. కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ సర్కారు ఆ ప్రతిపాదనలను తుంగలో తొక్కిందని.. రిసెర్చ్ సెంటర్ను పశ్చిమ బెంగాల్కు తరలించిందని మండిపడ్డారు. ఫ్లోరైడ్ సమస్యను దృష్టిలో పెట్టుకుని నల్లగొండలో ప్రత్యేకంగా 100 పడకల వైద్యశాలను ఏర్పాటు చేస్తామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హామీ ఇచ్చారని.. ఏండ్లు గడుస్తు న్నా ఆ హామీలకు దిక్కులేకుండా పోయిందని దుశర్ల సత్యనారాయణ నిప్పులు చెరిగారు. మునుగోడులో ఓట్లడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని ధ్వజమెత్తారు. ఫ్లోరైడ్ విముక్తి కోసం లక్ష కోట్ల ప్యాకేజీ ప్రకటించిన తర్వాతనే నల్లగొండలో బీజేపీ నేతలు అడుగు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
దశాబ్దాల ‘ఆర్తి’ని తీర్చిన ఘనత కేసీఆర్దే
2003లో ఫ్లోరోసిస్పై పోరుయాత్రను చేపట్టిన నాటి తెలంగాణ ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండలోని జలసాధన సమితి కార్యాలయాన్ని ప్రత్యేకంగా సందర్శించారని దుశర్ల సత్యనారాయణ గుర్తుచేశారు. ఫ్లోరైడ్ సమస్య విముక్తి కోసం చేపట్టాల్సిన చర్యలను కేసీఆర్కు వివరించామని, తెలంగాణ ఏర్పాటు తర్వాత ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఆచరణలో చూపుతున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు.
మిషన్ భగీరథను చేపట్టి ఇంటింటికీ నల్లా నీటిని అందిస్తున్నారని, తద్వారా ఫ్లోరైడ్ తగ్గుముఖం పడుతున్నదని తెలిపారు. నల్లా నీటితోపాటు భూగర్భజలాల పెంపు, సాగునీటిని అందించ డం ద్వారానే ఫ్లోరోసిస్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందంటూ తాము ఆనాడు చేసిన సూచనలను కూడా కేసీఆర్ ఆచరణలో పెట్టారని హర్షం వ్యక్తంచేశారు. మిషన్ కాకతీయతో భూగర్భ జలాల పెంపునకు కృషి చేస్తున్నారని, సాగునీటి కోసం అనేక రిజర్వాయర్లను నిర్మిస్తున్నారని వివరించారు. ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా, ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలన్నా అది టీఆర్ఎస్తోనే సాధ్యమని తెలిపారు. మునుగోడు ప్రజలు ఈ విషయాలన్నీ ఆలోచించి, ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు పట్టం కట్టాలని దుశర్ల పిలుపునిచ్చారు.
ఓట్లడిగే బీజేపీ నేతలకు సిగ్గుండాలె
మునుగోడు ఉపఎన్నికలో ఓట్లడిగేందుకు బీజేపీ నేతలకు సిగ్గుండాలె. రాజగోపాల్రెడ్డి స్వార్థం వల్లే ఉపఎన్నిక వచ్చింది. డిండి ప్రాజెక్టు ముందుకు సాగకపోవడానికీ ఆయనే కారణం. ఫ్లోరైడ్ విముక్తి కోసం విశేష కృషిచేస్తున్న టీఆర్ఎస్ వెన్నంటే అందరూ నిలువాలి.
– శ్రీనివాస్, దివ్యాంగుల పోరాట సమితి నేత
టీఆర్ఎస్తోనే ప్రగతి సాధ్యం
ఫ్లోరైడ్ సమస్యకు టీఆర్ఎస్ సర్కారు తో పరిష్కారం లభించింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఫ్లోరైడ్ను తగ్గించేందుకు ఎంతో దోహదపడుతున్నాయి. ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీటిని కూడా అందించడం ద్వారా ఫ్లోరైడ్కు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అది కేసీఆర్తోనే, టీఆర్ఎస్తోనే సాధ్యమైంది.
– కంచికట్ల సుభాష్ ఫ్లోరోసిస్ విముక్తి సమితి నేత
పింఛన్తోనే పూట గడుపుతున్నం
ఏ ఊరికి పోయినా మమ్మల్ని చూడగానే ఎక్కడ నుంచి వచ్చారని అడిగేవారు. నల్లగొండ అని చెప్పగానే ఫ్లోరైడ్ బాధితు లా? అని నోరెళ్లబెట్టేవాళ్లు. ఎవరూ సమస్యను పరిష్కరించలేదు.కేసీఆర్ వచ్చినంక నల్లా నీళ్లు వస్తున్నయ్. ఫ్లోరైడ్ కూడా తగ్గుతున్నది. కేసీఆర్ ఇస్తున్న పింఛన్తోనే ఎవ రి మీద ఆధారపడకుండా బతుకుతున్నం. – తిరుపతమ్మ,ఫ్లోరైడ్ బాధితురాలు, వట్టిపల్లి
కేసీఆర్ వెన్నంటే నిలవాలి
ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేశాం. ఆఖరికి ఢిల్లీ జంతమంతర్ వద్ద కూడా ధర్నా చేశాం. నన్ను స్వయంగా చూసిన ప్రధానమంత్రి, పముఖులు, హక్కుల నేతలు కన్నీటిపర్యంతమైన సందర్భాలు అనేకం. కృష్ణా నీళ్లు ఇవ్వాలని మొత్తుకున్నం. ఏ ఒక్కరూ సమస్యను పరిష్కరించలేదు. బస్సుల మీద తాగునీళ్లను తీసుకుపోయేటోళ్లం. కేసీఆర్ వచ్చాకే మా సమస్యకు పరిష్కారం లభించింది. నల్లాలతో నీళ్లొస్తున్నయ్. ప్రాజెక్టులు కూడా పూర్తయితే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అది చేసి చూపేది కేసీఆర్ మాత్రమే. అందుకే సారు వెన్నంటే నడవాలి. నడుస్తం.
– అంశల స్వామిఫ్లోరైడ్ బాధితుడు, మర్రిగూడ