హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : ప్రజాసమస్యలు పరిష్కరించడంలో బీజీపీ ప్రభుత్వం విఫలమైందని 11 వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీలు విమర్శించాయి. ప్రజల దృష్టిని పక్కదోవ పట్టిస్తూ, మతోన్మాద విధానాలను ముందుకు తెస్తున్న బీజేపీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఈనెల 30న హైదరాబాద్లో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు సోమవారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.
ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లోని గవర్నర్ వ్యవస్థను తమ స్వార్థ ప్రయోజనాలకోసం వాడుకుంటూ అక్కడి ప్రభుత్వాలను పడగొడుతున్నదని, రాజ్యాంగానికి విరుద్ధంగా ‘పౌరసత్వ సవరణ చట్టం 2019’(సీఏఏ)ను తెచ్చిందని మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రజావ్యతిరేక, మతోన్మాద, కార్పొరేట్ విధానాలను నిరసిస్తూ మార్చి 30న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహించి, రాష్ట్ర వ్యాప్తంగా విసృ్తత క్యాంపెయిన్కు కార్యాచరణను రూపొందించనున్నట్టు వెల్లడించాయి. ఈ సదస్సులో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని 11 వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీలు పిలుపునిచ్చాయి.