ఇదే బీజేపీ నేతల తంత్రం
పునరుత్పాదక ఇంధనంఎక్కడైనా కొనవచ్చంటూ చిలుక పలుకలు
కానీ అమ్మేది మాత్రం అదానీ ఒక్కరే
హైదరాబాద్, ఫిబ్రవరి 17: పునరుత్పాదక విద్యుత్తు (రెన్యూవబుల్ ఎనర్జీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు రెన్యూవబుల్ ఎనర్జీని తమకు ఇష్టం వచ్చిన సంస్థల నుంచి కొనుగోలు చేసే అవకాశాన్ని రాష్ర్టాలకు కల్పించామని చెప్తూనే మరోవైపు దారులన్నీ మూసివేసే ప్రయత్నం చేస్తున్నది. దీనిని గమనించిన సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. గుజరాత్ వ్యాపారవేత్త అదానీకి దోచిపెట్టేందుకే కేంద్ర ప్రభు త్వం రాష్ర్టాలపై భారం మోపుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి ఆర్కే సింగ్.. ఓవైపు స్వేచ్ఛ ఇచ్చామని చెప్తూనే రాష్ర్టాలన్నీ కచ్చితంగా అదానీ గ్రూపు నుంచే కొనుగోలు చేసే పరిస్థితులు కల్పిస్తున్నారు. దేశంలో ఇప్పటికే 12 రాష్ర్టాల్లోని 93 ప్రాంతాల్లో 20 వేల మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను 40 వేల మెగావాట్లకు పెంచేందుకు అదానీ సంస్థ చర్యలు చేపట్టింది. మరోవైపు కేంద్రం ఇటీవల తెచ్చిన నూతన నిబంధనల ప్రకారం ప్రతి రాష్ట్రం ఏడాదికి కనీసం 30 శాతం పునరుత్పాదక విద్యుత్తును ఉపయోగించాల్సి ఉంటుంది. పునరుత్పాదక విద్యుత్తుపై అదానీకే గుత్తాధిపత్యం ఉండటం, రాష్ర్టాలు తప్పనిసరిగా 30 శాతం ఆ విద్యుత్తును వినియోగించాలని నిబంధన విధించడం వెనుక బీజేపీ నేతల తంత్రం బోధపడుతున్నది. రాష్ర్టాలను, ప్రజలను దోచి వారి పార్టీకి నిధులు ఇచ్చే బడా పారిశ్రామికవేత్తల జేబులు నింపడమే ఉద్దేశంగా కనిపిస్తున్నదని నిపుణులు పేర్కొంటున్నారు.