హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం రాష్ర్టానికి చెప్పిన మాట పచ్చి నిజమని వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. మోటర్లకు మీటర్లు పెడితే రాష్ర్టానికి రూ.30 వేల కోట్ల వరకు ఎఫ్ఆర్బీఎం కింద అనుమతిస్తామని ఎర చూపిందని పేర్కొన్నారు. కానీ, రాష్ట్ర రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టకూడదని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారని వెల్లడించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాత్రం తమ ప్రభుత్వ నిర్ణయాలపైనే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మీటర్లపై కేంద్ర ఆర్థికశాఖ.. రాష్ర్టానికి రాసిన లేఖను హరీశ్రావు మీడియాకు విడుదల చేశారు. మీటర్లు పెడితే రాష్ట్రానికి ఐదు సంవత్సరాల పాటు ఏడాదికి రూ.6వేల కోట్ల చొప్పున ఎఫ్ఆర్బీఎం కింద అనుమతి ఇస్తుందని కేంద్రం స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, టీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్కుమార్, దేవీప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. మోటర్లకు మీటర్ల వ్యవహారంపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని ఆ క్యాబినెట్ సభ్యుడైన కిషన్రెడ్డి తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారన్నారు.
తలకాయలు ఏడ పెట్టుకొంటరు?
మోటర్లకు మీటర్ల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ.. రాష్ట్ర ఆర్థిక శాఖకు రాసిన లేఖలను హరీశ్రావు మీడియాకు విడుదల చేశారు. 2021 జూన్ 9న కేంద్రం నుంచి లేఖ వచ్చిందని తెలిపారు. అదే ఏడాది అక్టోబర్ 28న రూరల్ ఎలక్ట్రిఫికేషన్ (ఆర్ఈసీ) మార్గదర్శకాలు విడుదలచేస్తూ లేఖ రాసిందని వెల్లడించారు. ఎఫ్ఆర్బీఎం కింద 0.5% జీఎస్డీపీ నిధులు కావాలం టే మోటర్లకు మీటర్లు పెట్టాల్సిందేనని నిబంధన విధించారని తెలిపారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇవ్వవద్దు అని కేంద్రం తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నదని వెల్లడించారు. రైతులు తమకు అవసరమైన దానికంటే తక్కు వ విద్యుత్తును వినియోగిస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారన్నారు. కరెంటు ఎంత వాడారో తెలుసుకోవాలంటే మీటర్లు పెట్టాలని, ఇందుకు ఒప్పుకొంటే రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వాలంటూ దాని ప్రొఫార్మా కూడా తయారుచేసి పంపించారని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కారు 65 లక్షల రైతుల మెడకు ఉరితాడు వెయ్యాలని భావించిందని, సీఎం కేసీఆర్ రైతుబిడ్డ కాబట్టి.. మీటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టేది లేదని అసెంబ్లీలోనే కుండబద్దలు కొట్టారని గుర్తుచేశారు. కేంద్రం పంపించిన లేఖలు చూసిన తర్వాత బండి సంజయ్, కిషన్రెడ్డి తలకాయలు యాడ పెట్టుకొంటారన్నారు. ఇలాంటి బీజేపీకి మునుగోడు రైతులు కచ్చితంగా కర్రుకాల్చి వాత పెడుతారని తెలిపారు. మీటర్లు పెట్టేది లేకపోతే.. 30 వేల కోట్లు రాష్ర్టానికి తేవాలని, కనీసం నిరుడు, ఈ ఏడాదికి సంబంధించి 12 వేల కోట్లు తెచ్చి మాట్లాడాలని కిషన్రెడ్డికి సవాలు విసిరారు.
విద్యుత్తు మీటర్లపై కేంద్రం రాసిన లేఖలను సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చూపుతున్న మంత్రి హరీశ్రావు
బీజేపీది అబద్ధాల డీఎన్ఏ
బీజేపీ నేతలు ఒక అబద్ధాన్ని పదేపదే చెప్తూ అదే నిజమని నమ్మించాలని చూస్తున్నారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. మునుగోడులో సీఎం కేసీఆర్ సభతో బీజేపీ నేతలకు కంటిమీద కునుకులేకుండా పోయిందని ఎద్దే వా చేశారు. ‘బండి సంజయ్, కిషన్రెడ్డి ఫ్రస్ట్రేషన్లో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వారివి మకిలి మాటలు.. వెకిలి చేష్టలు. అంతులేని అబద్ధాలు ఆడటం బీజేపీ డీఎన్ఏగా మారింది. అందుకే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీవినీ ఎరుగని రీతిలో చరిత్ర సృష్టించేంత గొప్పగా టీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేసిన మునుగోడు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గల్లీలో ఉండే నాయకుడు కూడా మాట్లాడలేనంత చిల్లరగా కిషన్రెడ్డి, బండి సంజయ్ మాట్లాడుతున్నారన్నారు. వీళ్ల స్థాయి ఏపాటిదో ఢిల్లీ దూతలు చెప్పారని ఎద్దేవా చేశారు.
దయ్యాలు వేదాలు వల్లించినట్లు..
చేరికలకు సంబంధించి బీజేపీ నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టేనని హరీశ్రావు అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వందల కోట్లు ఆశ చూపినా వారు దానిని గడ్డిపోచలాగా వదులుకొని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నడుం బిగించారని తెలిపారు. ప్రభుత్వాలను కూల్చే పని టీఆర్ఎస్ ఎన్నడూ చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్యాంగబద్ధంగా టీఆర్ఎస్లో విలీనమయ్యారని చెప్పారు. పార్లమెంట్లో టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీ విలీనం చేసుకోలేదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఆ పార్టీ ఫిర్యాదు చేసి రెండేండ్లయినా ఎందుకు పెండింగ్లో ఉన్నదని ప్రశ్నించారు. గుజరాత్లో ఇటీవలే 8 మంది ఎమ్మెల్యేలను, సిక్కింలో 13 మంది ఎమ్మెల్యేలను బీజే పీ చేర్చుకొన్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, దొడ్డిదారిన ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ నేతలకు మాట్లాడే నైతిక హక్కులేదని హరీశ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో స్వామీజీలకు, తమకు సంబంధం లేదన్న వాళ్లే.. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్టు.. కేసు సీబీఐకి ఇవ్వాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి హైకోర్టులో కేసు ఎందుకు వేశారని ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసుల పరిధిలో ఉంటే మీ బట్టలు ఎక్కడ విప్పుతరో అని భయపడి కేసు వేశారని తెలిపారు.
జీఎస్టీని తెలంగాణ వ్యతిరేకించింది
చేనేతపై జీఎస్టీ అంశం గురించి బీజేపీ నేత లు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. చేనేతపై జీఎస్టీని తెలంగాణ స్పష్టంగా వ్యతిరేకించిందని తెలిపారు. 2017 జూలై 1 నుంచి చేనేతపై జీఎస్టీ అమల్లోకి వచ్చిందని.. అప్పుడు ఆర్థికమంత్రిగా.. ఇప్పు డు బీజేపీలో ఉన్న ఈట ల రాజేందరే ఉన్నారని.. ఆయన్ను అడిగితే చెప్తారని సూచించారు. 2017 జూన్ 11న జరిగిన జీఎస్టీకౌన్సిల్ సమావేశానికి ఆర్థిక మంత్రి గా ఈటల హాజరయ్యారని, ఆ సమావేశంలో కూడా తెలంగాణ జీఎస్టీని వ్యతిరేకించిందని తెలిపారు. ఆ సమావేశంలో ప్రసంగ ప్రతులను మంత్రి మీడియాకు విడుదల చేశారు. చేనేతకు జీఎస్టీపై తాను సంత కం చేశానంటూ కనీస పరిజ్ఞానం లేకుండా కేం ద్ర మంత్రి మాట్లాడటం విడ్డూరమన్నారు. తాను ఆర్థికమంత్రి అయిన తర్వాత చేనేతపై జీఎస్టీని 5% నుంచి 12% పెంచడానికి కేంద్రం ప్రతిపాదించిందని, అన్ని రాష్ర్టాలు వ్యతిరేకించడంతో అమలుచేయలేదని గుర్తుచేశారు. చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ 2017 లోనే ప్రధానికి, కేంద్ర మంత్రులకు లేఖలు రాశారని తెలిపారు. దీనిపై టీఆర్ఎస్ ప్లీనరీలో కూడా తీర్మానం చేశామని వెల్లడించారు.
మిగిలిన 17,200 కోట్లు తీసుకరండి..
ప్రతి ఇంటికి స్వచ్ఛ నీటిని అందించడంలో తెలంగాణ చాంపియన్ అని నీతి ఆయోగ్ చెప్పిందని హరీశ్ గుర్తుచేశారు. ఈ విధానం దేశానికి దిక్సూచిగా నిలిచిందంటూ దీనికోసం రూ.19,200 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫా ర్సు చేసిందని చెప్పారు. హర్ఘర్ జల్ యోజనలో 50% నిధులు ఇస్తామని కేంద్రం చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ.. తెలంగాణ.. రూ.36 వేల కోట్లతో ప్రాజెక్టు పూర్తిచేసి ఇంటింటికీ నల్లా నీటిని అందిస్తున్నదని.. కేంద్రం చెప్పిన మాటే నిజమైతే.. కేంద్రం వాటాగా 18 వేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నదని, అందులో 800 కోట్లు పోగా.. మిగిలిన రూ.17,200 కోట్లు తేవాలని కిషన్రెడ్డిని డిమాండ్చేశారు. 15వ ఆర్థిక సం ఘం కూడా మిషన్ భగీరథను మెచ్చుకొన్నద ని.. నిర్వహణకు 2,350 కోట్ల ఇవ్వాలని చెప్పి నా కేంద్రం పట్టించుకోలేదని మండిపడ్డారు.
ఇప్పుడు అదే విధంగా జరగాలా?
గుజరాత్లో కేబుల్ బ్రిడ్జ్ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు మంత్రి హరీశ్రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని ఆకాంక్షించారు. బెంగాల్లో గతంలో ఒక బ్రిడ్జి పడిపోతే.. అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టండని దేవుడు సిగ్నల్ ఇచ్చినట్టు మోదీ మాట్లాడారని.. ఇప్పుడు గుజరాత్లో కూడా అలాగే భావించాలా? అని ప్రశ్నించారు. ఏ రోటికాడ ఆ పాట పాడటం సరైనదేనా? అని నిలదీశారు.
కృష్ణా జలాల పంపిణీ సమావేశాలకు పిలిచారా?
కృష్ణా జలాల పంపిణీపై చర్చకు అనేక సార్లు కేంద్రం పిలిచినా తెలంగాణ పోలేదని కిషన్రెడ్డి చెప్పిన మాటలకు మించిన జోక్ మరొకటి లేదని మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని దాదాపు 20 లేఖలను ప్రధానికి, కేంద్ర జల్శక్తి శాఖకు సీఎం కేసీఆర్, నీటిపారుదలశాఖ మంత్రి, ఉన్నతాధికారులు రాశారని, ఏడాదిలోపు పరిష్కరించకపోతే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని చట్టంలో ఉన్నా బీజేపీ పట్టించుకోలేదని చెప్పారు. రాష్ట్రం వచ్చిన మొదటి నెలలోనే ఉత్తరం రాసిన విషయాన్ని గుర్తుచేశారు. కిషన్రెడ్డి బాధ్యత మరచి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
దమ్ముంటే మునుగోడుకు పద!
‘ఎనిమిదేండ్లలో మునుగోడుకు ఏమీ చేయలేదా? దమ్ముంటే మునుగోడుకు పోదాం పదా! అభివృద్ధి సంక్షేమం చూపిస్తా’ అని హరీశ్రావు బీజేపీ నేతలకు సవాలు విసిరారు. మునుగోడులో 99% మందికి టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ ఫలితాలు అందాయని తెలిపారు. ఇక్కడ ఏ ఇంటికి పోయినా.. శుద్ధిచేసిన కృష్ణా జలాల గురించి చెప్తారన్నారు. మర్రిగూడ మండలంలో ఒక మహిళ ‘అన్నా భుజం మీద బిందె ఎత్తక నాలుగేండ్లు అయింది. కేసీఆర్ దయ వల్ల నీటి బాధ తప్పింది’ అంటూ సంతోషంగా చెప్పిందన్నారు. ఇవన్నీ చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ గ్యాస్ బండ ధరను రూ.400 నుంచి రూ.1200 పెంచిందని, పెట్రో ధరలకు హద్దే లేకుండా పోయిందని విమర్శించారు. ‘మీరు పెంచుడు.. మేం పంచుడు’ అన్నట్టుగా జరుగుతున్నదని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతల కండ్లకు పొరలు కమ్మాయని ఎద్దేవా చేశారు.