హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ఆర్థిక నేరగాళ్లకు సహకరించడం.. బ్యాంకులను మోసగించిన బడాబాబులను పార్టీలో చేర్చుకోవడం.. హత్యలకు, లైంగికదాడులకు పాల్పడిన నేరస్తులకు అండగా నిలవడం, వారిని సన్మానించడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా బీజేపీ నేతలు ఇదే పని చేస్తున్నారనడానికి పైన ఉదహరించిన ఘటనలే నిదర్శనం. ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నించిన వారికి, పోలీసులు అరెస్ట్ చేసిన వారికి మొదటి నుంచీ బీజేపీ నేతలు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు.
వారు ‘దొంగలకు సద్ది కట్టడం’ అనే సామెతను రుజువు చేస్తున్నారు. పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీ కేసులో బూరం ప్రశాంత్ను వరంగల్ పోలీసులు గతవారం అరెస్ట్ చేయగానే మొట్టమొదటగా బీజేపీ నేతలే స్పందించారు. ప్రశాంత్ అరెస్ట్ అక్రమమం టూ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ పోలిస్ కమిషనరేట్ ముందు ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో.. ‘ప్రశాంత్కు బీజేపీకి సంబంధం లేదు. అతడు ఏబీవీపీ కార్యకర్త మాత్రమే’ అంటూ బీజేపీ నేతలు బుకాయించారు. జర్నలిస్టుగా మాత్రమే తమకు తెలుసంటూ చెప్పుకొచ్చారు. తీరా జైలు నుంచి విడుదలైన తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధి వెళ్లి సన్మానం చేశారు. ప్రశాంత్కు బెయిల్ రావడం వెనుక న్యాయ సహాయం అందించింది కూడా బీజేపీయేనని సమాచారం.
పై ఫొటోలో సన్మానం పొందుతున్నది దేశానికి పతకం తెచ్చిన క్రీడాకారుడో.. శత్రువులకు ఎదురొడ్డి పోరాడిన వీర సైనికుడో.. చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచి ర్యాంకు సాధించిన మెరిట్ స్టూడెంటో కాదు. సుమారు 5 లక్షల మంది పదో తరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన పేపర్ లీక్ కేసు నిందితుడు బూరం ప్రశాంత్. బెయిల్పై బుధవారం బయటికి వచ్చిన ప్రశాంత్ను బీజేపీ
అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, మరికొందరు నాయకులు కలిసి ఇలా సన్మానించుకున్నారు.
ఈ ఫొటోలో ఉన్నది లైంగికదాడి, హత్య కేసులో జైలుశిక్ష అనుభవించిన దోషులు. 2002లో జరిగిన గోద్రా అల్లర్ల సందర్భంగా గుజరాత్లోని దాహోడ్ జిల్లా రంధిక్పూర్లో గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై సామూహికంగా లైంగికదాడికి పాల్పడి, ఆమె 14 మంది బంధువులను దారుణంగా హత్యచేసిన కేసులో 11 మందిని కోర్టు దోషులుగా ఖరారు చేసి 2008లో యావజ్జీవ శిక్ష విధించింది. వీరి ‘సత్ప్రవర్తన’కు మెచ్చి గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 15న జైలు నుంచి విడుదల చేసింది. అదే రోజున దీన్దయాళ్ ట్రస్ట్ ఆడిటోరియంలో బీజేపీకి మాతృ సంస్థ అయిన ఆరెస్సెస్ నేతలు అర్వింద్ సిసోడియా నేతృత్వంలో ఇలా సన్మానించారు.
ఈ ఫొటోలో ప్రశంసాపత్రం అందుకుంటున్న వ్యక్తి శిఖర్ అగర్వాల్ కాగా.. ఇస్తున్న వ్యక్తి బీజేపీ బులంద్షహర్ జిల్లా అధ్యక్షుడు అనిల్ సిసోడియా. బీజేపీ యువజన విభాగం అధ్యక్షునిగా పనిచేసిన శిఖర్అగర్వాల్ స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ సుబోధ్కుమార్సింగ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు. బెయిల్పై విడుదలైన నిందితుడు ప్రధాన్మంత్రి జన్ కల్యాణ్కారి యోగి జాగృక్తా అభియాన్ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన సందర్భంగా ఇలా సన్మానించారు.