హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ధన అహంకారంతో రెచ్చిపోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మునుగోడు ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని తెలంగాణ ఆరెకటిక సంఘం ప్రకటించింది. కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయిన వ్యక్తిని కాకుండా, అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకునే టీఆర్ఎస్ పార్టీని మునుగోడులో గెలిపిస్తామని రాష్ట్ర ఆరె కటిక సంఘం నేతలు స్పష్టంచేశారు. మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన ఆరె కటిక సంఘం ప్రతినిధులు బుధవారం హైదరాబాద్లో ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మంత్రి హరీశ్రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆరె కటిక నేతలు మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఇప్పటికే నిర్ణయమైపోయిందని పేర్కొన్నారు. రాబోయే 20 రోజుల్లో పూర్తిస్థాయిలో పనిచేసి కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని వారికి హరీశ్రావు సూచించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హకీంకారి సువేందర్ జీ, ఉపాధ్యక్షుడు కళ్యాణ్ కార్ జహంగీర్ జీ, ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ కార్ శివప్రసాద్, మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.
కారెక్కిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు
మర్రిగూడెం మండల నాయకులు, కార్యకర్తలు మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు సిలివేరు రఘు, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు పోలె సైదులు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొనుగోటి భాసర్రావు, మండల కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ సహా 30 మంది కార్యకర్తలు ఉన్నారు.