Kaleshwaram | హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ను బద్నాం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కుని కుట్రలు పన్నుతున్నాయి. మేడిగడ్డ ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) స్పందిస్తున్న తీరును, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు నిపుణుల కమిటీని వేయడాన్ని చూస్తుంటే ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని మరోసారి స్పష్టమవుతున్నది.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 ప్రకారం.. దేశంలో ఏ డ్యామ్ ప్రమాదం వాటిల్లినా వెంటనే ఎన్డీఎస్ఏ తనకుతానుగా స్పందించాల్సి ఉంటుంది. గతేడాది అక్టోబర్ 21న మేడగడ్డ బరాజ్లోని పిల్లర్ కుంగుబాటునకు గురైన వెంటనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఎన్డీఎస్ఏ ఆగమేఘాల మీద కమిటీని వేసింది. ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్జైన్తోపాటు కే శర్మ, ఆర్ తంగమాణి, రాహుల్ కే సింగ్, దేవేందర్రావు, కేజీబీవో నామినేట్ చేసిన మరో ఇద్దరు సభ్యులతో కూడిన ఆ కమిటీ అక్టోబర్ 23న రాష్ర్టానికి విచ్చేసింది.
24న మేడిగడ్డ బరాజ్ను సందర్శించింది. 25న తెలంగాణ ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ప్రాజెక్టు అధికారులు, బరాజ్ నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై సాంకేతిక అంశాలకు సంబంధించిన అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నది. పూర్తి సమాచారాన్ని రాష్ట్ర అధికారులు ఇవ్వకముందే అక్టోబర్ 29 నాటికే మేడిగడ్డ బరాజ్ ఘటనపై ప్రాథమిక నివేదికను వెలువరించింది. దాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా నేరుగా పత్రికలకు విడుదల చేసింది. ఎలాంటి పరీక్షలు, పరిశోధనలు చేయకుండా కేవలం క్షేత్రస్థాయి సందర్శనకే పరిమితమైన ఎన్డీఎస్ఏ.. బరాజ్ కుంగుబాటుకు డిజైన్, నాణ్యత లోపాలే కారణమని నిర్ధారించింది.
స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం, అధికారం ఎన్డీఎస్ఏకి ఉన్నప్పటికీ మేడిగడ్డ ఘటనపై గత 4 నెలల్లో ఎన్నడూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బరాజ్ను పూర్తిస్థాయిలో పరిశీలించి లోపాలను గుర్తించాలని, తదుపరి చేపట్టాల్సిన పునరుద్ధరణ పనులపై తగిన సిఫారసులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గత నెల 13న కేంద్ర జల్శక్తి శాఖకు విజ్ఞప్తి చేసింది. దీంతో మళ్లీ మేలుకున్న ఎన్డీఎస్ఏ.. మేడిగడ్డ ఘటనపై అధ్యాయనానికి ఇటీవల సీడబ్ల్యూసీ, గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది. కానీ, నాడు కేవలం వారం రోజుల్లోనే రిపోర్టు ఇచ్చిన ఎన్డీఎస్ఏని ఇప్పుడు 4 నెలల్లో నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.
మేడిగడ్డతోపాటు, అన్నారం, సుందిళ్ల బరాజ్లను పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసేందుకు అధిక సమయం పట్టినప్పటికీ ఈ లోగా చేపట్టాల్సిన తాత్కాలిక రక్షణ చర్యలను వెంటనే సిఫారసు చేయాలని కేంద్రం ఎన్డీఎస్ఏ కమిటీకి స్పష్టం చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఇప్పటికే 4 నెలల సమయం వృథా కావడంతో ఇక మిగిలి ఉన్నది 3 నెలలే. ఎందుకంటే జూన్ మొదటి వారం నుంచి ప్రాణహితలో వరద ప్రవాహాలు ప్రారంభమవుతాయి. బరాజ్ రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్నా కూడా ఈ లోపే సాధ్యమవుతుంది. ఆ తర్వాత డిసెంబర్ వరకు గోదావరిలో ఎలాంటి పనులు చేపట్టడం సాధ్యం కాదు. దీన్ని కేంద్రం విస్మరించి 4 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి సిఫారసు చేయడంతో అప్పటివరకు అక్కడ పునరుద్ధరణ చర్యలతోపాటు కనీస రక్షణ పనులను కూడా చేపట్టేందుకు వీల్లేకుండా పోయింది.
ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను చూస్తుంటే మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనులు డిసెంబర్ చివరి వరకూ ప్రారంభమయ్యే అవకాశం లేదని స్పష్టమవుతున్నది. ఎన్డీఎస్ఏ కమిటీ తన నివేదికను సమర్పించే వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నివారణ, రక్షణ చర్యలు చేపట్టే అవకాశం కనిపించడం లేదు. జూన్ మొదటి వారం నుంచి గోదావరిలో వరద ప్రవాహాలు ప్రారంభమవుతాయి.
మేడిగడ్డ వద్ద దాదాపు 5 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. దీనికి వరద ప్రవాహాలు కూడా తోడైతే డిసెంబర్ వరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టడం సాధ్యం కాదని ఇంజినీర్లే తేల్చిచెప్తున్నారు. దీంతో ప్రస్తుతం 7వ బ్లాక్కే పరిమితమైన సమస్యలు వరద వల్ల ఇతర బ్లాక్లకు విస్తరించడం ఖాయమని, తద్వారా మొత్తం బరాజ్కు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ఎన్డీఎస్ఏతో చర్చించాలని, 7వ బ్లాక్లో తలెత్తిన సమస్యలు ఇతర బ్లాక్లకు విస్తరించకుండా వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు బీఆర్ఎస్ను బద్నాం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. తాజాగా ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఏర్పాటుతో ఆ రెండు పార్టీల కుట్ర మరోసారి బట్టబయలైందని రాజకీయ విశ్లేషకులు తేల్చిపారేస్తున్నారు. అక్టోబర్ 21న మేడిగడ్డ బరాజ్లో పిల్లర్ కుంగిన వెంటనే నాటి బీఆర్ఎస్ సర్కార్ను బద్నాం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రాజకీయ కోణంలోనే ఎన్డీఎస్ఏ బృందాన్ని రాష్ర్టానికి పంపి వారం రోజుల్లోనే అసంబద్ధ వివరాలతో ప్రాథమిక నివేదికను విడుదల చేయించిందని, ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టాక కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదని గుర్తుచేస్తున్నారు.
రేవంత్రెడ్డి సర్కారు సైతం శ్వేతపత్రం, మంత్రుల పర్యటన అంటూ బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు ప్రయత్నించిందే తప్ప మేడిగడ్డ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఎన్డీఎస్ఏకి లేఖ రాయలేదు. ప్రస్తుతం పంటలు ఎండిపోతుండటంపై రైతులు కన్నెర్ర చేస్తుండటంతో మేడిగడ్డ బరాజ్కు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి నీటిని లిఫ్ట్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్ సర్కారు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎన్డీఎస్ఏకు లేఖ రాసింది. మరోవైపు రేవంత్ సర్కారును గట్టెక్కించేందుకు కేంద్రం ఇప్పుడు కమిటీని వేసి నివేదికకు 4 నాలుగు నెలల గడువు ఇచ్చింది. దీనిని సాకుగా చూపి మరమ్మతులు చేపట్టకుండా కాంగ్రెస్ సర్కారు తప్పించుకునేందుకు కేంద్రం సహకరిస్తున్నది.