సిద్దిపేట,సెప్టెంబర్ 18 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని 31వ వార్డుకు చెందిన 50 మంది బీజేపీ కార్యకర్తలు పట్టణ బీజేపీ అధ్యక్షుడు బాషా శ్రీకాంత్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మంత్రి హరీశ్రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. కులమతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉన్నాయా? అని ప్రశ్నించారు.
తెలంగాణ మీద ప్రేమ పార్టీ ఒక్క టీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మత చిచ్చు నుంచి కాపాడేది కూడా టీఆర్ఎస్ మాత్రమే అన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు.
కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ మెంబర్ పాల సాయిరాం, కౌన్సిలర్ పూర్ణిమ, శ్రీహరి యాదవ్, మమహ్మద్ చాంద్ ఉన్నారు.