చిల్లర కాషాయదళాన్ని తిరస్కరించిన మేధావి వర్గం
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీజేపీది బలుపు కాదు.. వాపేనని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలిపోయింది. దుబ్బాక అసెంబ్లీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అటూఇటూ కాని గెలుపుతో పట్టపగ్గాలు లేకుండా చెలరేగిన ఆ పార్టీ నాయకులకు పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి చెంపపెట్టులాంటివని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ నేతల నోటి దురుసు వల్లనే నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో అడ్రస్ లేకుండా పోయిందని, సిట్టింగ్ స్థానమైన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ను కూడా కోల్పోయిందని విశ్లేషిస్తున్నారు.
అరాచకం చెల్లదు
కొంతకాలంగా బీజేపీ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీ నేతలపై చౌకబారు విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో బీజేపీకి అలవాటైన రీతిలో తప్పుడు ప్రచారం చేస్తూ వచ్చారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మత రాజకీయాలు చేసి లబ్ధిపొందేందుకు ప్రయత్నించారు. టీఆర్ఎస్ పని అయిపోయిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఎదురులేదని విర్రవీగారు. క్రితంసారి గెలిచిన బీజేపీ నేత రాంచందర్రావు నిరుద్యోగుల పక్షాన ఒక్కరోజు కూడా మండలిలో గళం విప్పిన దాఖలాలు లేవు. తాజా ఎన్నికల్లో మాత్రం ఉద్యోగాల కల్పనపై తప్పుడు లెక్కలతో నిరుద్యోగులను మాయచేసే ప్రయత్నం చేశారు. బీజేపీ నేతల కుటిల రాజకీయాలను పట్టభద్రులు స్పష్టంగా తిరస్కరించారు.