హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా గ్యా స్ తదితర ధరలను పెంచుతుండటంపై ఓ కళాకారుడు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఏకంగా బైక్ యాత్రను చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. భద్రచలానికి చెందిన తూతిక ప్రకాశ్ వృత్తిరీత్యా సాధారణ రైతు. ప్రవృత్తి రీత్యా ఫ్లూట్ వాద్య కళాకారు డు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎడాపెడా గ్యా స్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలను పెంచుతుండటంతో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయారు.పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తీరుపై వినూత్న రీతిలో నిరసన తెలుపాలని నిర్ణయించుకొని భద్రాచలం నుంచి మార్చి 10న బైక్ యాత్ర చేపట్టారు. ఇప్పటివరకు 12 జిల్లాల మీదు గా 3,800 కిలోమీటర్లు యాత్రను కొనసాగించా రు. ప్రస్తుతం హైదరాబాద్కు చేరుకున్నారు.
ఫ్లూట్ వాయిస్తూ..
ప్రతి గ్రామంలో ప్రకాశ్ ఫ్లూట్ వాయించడం ప్రారంభిస్తారు. జనం గుమిగూడిన తర్వాత కేంద్రం గ్యాస్ ధరలను పెంచుతున్న తీరు, ప్రజల ఇబ్బందులను వివరిస్తారు. చెట్ల కింద, పార్కుల్లో, దేవాలయాల్లో విడిది చేస్తూ సొంతఖర్చులతో యా త్రను కొనసాగిస్తుండటం గమనార్హం. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలపై ఆనందం వ్యక్తం చేస్తుండటంతోపాటు వాటిపై అవగాహన కల్పించేందుకు యా త్ర చేపట్టారు. ప్రకాశ్ యాత్రను మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారు. ప్రకాశ్ను మంత్రి హరీశ్రావు అభినందించడంతోపాటు బైక్ను బహూకరించారు.